Singareni : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు ఈనెల 20న జరగనున్న సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సమ్మె ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియాలోని కాసిపేట ఒకటో గనిలో AITUC, INTUC, CITU, TBGKS సంఘాల నాయకులు పాల్గొని కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా
AITUC బెల్లంపల్లి బ్రాంచి సెక్రెటరీ దాగం మల్లేష్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తూ ప్రవేటుకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. బొగ్గు గనులను బడా పారిశ్రామిక వేత్తలకు అప్పచెప్పడంతో కార్మికులకు నష్టం ఏర్పడుతుందన్నారు. అదాని, అంబానీలకు మేలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆరోపించారు.
INTUC సెంట్రల్ కమిటీ ప్రచార కార్యదర్శి బన్న లక్ష్మణ్ దాస్ మాట్లాడుతూ మే 20వ తారీకు జరగబోయే సమ్మెను విజయమంతం చేయాలని కోరారు. ఢిల్లీ వేదికగా జరిగిన రైతుల పోరాటాలను ఆదర్శంగా తీసుకొని సింగరేణి కార్మికులు కేంద్రప్రభుత్వంపై పోరాటం చేసి కార్మికుల హక్కులను సాధించుకోవాలన్నారు.
CITU వైస్ ప్రెసిడెంట్ వెంకట స్వామి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిశ్రమలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు చట్టాలను మారుస్తున్నారని ఆరోపించారు. 44 చట్టాలను 4 కోడ్ లుగా చేసి కార్మిక వర్గాలను బజారున వేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. TBGKS పిట్ సెక్రెటరీ నైరి శంకర్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమే బిజెపి ప్రభుత్వం ఉద్దేశ్యమని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మీనుగు లక్ష్మీ నారాయణ, రాజేందర్,సురేష్, INTUC నాయకులు సోగాల కన్నయ్య, రాజ్ కుమార్, ఫిట్టర్ సంపత్,రాజేశం,TBGKS నాయకులు చోల్లంగి శ్రీనివాస్, అబ్దులుద్దీన్, రమేష్, సతీష్, CITU నాయకులు దెబ్బేటి తిరుపతి, శ్రీధర్,రమేష్, దినేష్, అశోక్, శ్రీహరి, రవి, లింగయ్య, శంకర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.