జేకె5-ఓసి లో నిల్వ ఉన్న బొగ్గు
గనిని మూసివేస్తున్నారంటూ దుష్ప్రచారం
బదిలీల పేరిట కార్మికులకు వేధింపులు
డైరెక్టర్ పిపి కి AITUC వినతి పత్రం
Singareni : ఇల్లందు ఏరియాలోని జేకే5-ఓసీ గనిలో బొగ్గు నిల్వలు నిండుకున్నాయని, త్వరలోనే అక్కడి కార్మికులను బదిలీ చేస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. బుధవారం ఏఐటీయూసీ నాయకులు జేకే5-ఓసీ గనిలో బొగ్గు ఉత్పత్తి కొనసాగించాలని కోరుతూ సింగరేణి డైరెక్టర్ పిపి కొప్పుల వేంకటేశ్వర్లు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా సీతారామయ్య మాట్లాడుతూ…..
గనిని మూసివేస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేయడంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేటికి కూడా జేకె5-ఓసిలొ అపారమైన బొగ్గు నిలువలు ఉన్నాయని డైరెక్టర్ కు వివరించారు. అధికారుల, సూపర్ వైజర్ల , కార్మికుల సమిష్టి కృషితో జేకె5-ఓసి గని అనేక అవార్డులు అందుకున్నదని సీతారామయ్య ఈ సందర్బంగా యజమాన్యంకు గుర్తుచేశారు. ఇల్లందుపై ప్రత్యేక దృష్టి సారించి జేకె5-ఓసిని కొనసాగించాలని కోరారు. కార్మికులను బదిలీలు చేయకుండా ఉండాలని స్పష్టం చేశారు.
డైరెక్టర్ పిపి కొప్పుల వేంకటేశ్వర్లు యూనియన్ నాయకులతో ఈ సందర్బంగా మాట్లాడుతూ త్వరలోనే జేకె5-ఓసి సందర్శించి నిర్ణయం తీసుకుంటానాని హామీ ఇవ్వడం జరిగింది. నూతన ఓసి పొడిగింపు కు సంబంధించిన పనులను తొందరగా పూర్తి చేయడానికి కృషి చేస్తానని, అదేవిదంగా ఓసి నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తానని డైరెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కె సారయ్య, రాంగోపాల్, బాజిసైదా, సురెందర్, రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.