Singareni : బొగ్గు మైనింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి కాలరీస్ లిథియం లాంటి క్రిటికల్ మినరల్స్ రంగంలోకి ప్రవేశించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఐఐటీ హైదరాబాద్ సంస్థతో ఇటీవల కీలక ఒప్పందం జరిగింది.
ఈ ఒప్పందానికి కొనసాగింపుగా శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బి.ఎస్.మూర్తి నేతృత్వంలో ప్రొఫెసర్ల బృందం సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ నేతృత్వంలో డైరెక్టర్లు, సీనియర్ మైనింగ్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం జరిగింది. క్రిటికల్ మినరల్స్ రంగంలోకి ప్రవేశించేందుకు సింగరేణి చేస్తున్న ప్రయత్నాలకు హైదరాబాద్ ఐఐటీ పూర్తి సహకారం అందిస్తుందని ఆ సంస్థ డైరెక్టర్ శ్రీ బి.ఎస్.మూర్తి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
సింగరేణి సంస్థ ఇప్పటికే జైపూర్ లో విద్యుత్ పరిశ్రమను నిర్వహిస్తోంది. సోలార్ పవర్ ప్లాంట్ లను కూడా ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. తాజాగా క్రిటికల్ మినరల్స్ మైనింగ్ రంగంలోకి సింగరేణి అడుగుపెట్టడంతో సంస్థ పరంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం కూడా ఉంది. క్రిటికల్ మినరల్స్ మైనింగ్ రంగం ప్రారంభమైన నేపథ్యంలో సింగరేణి విస్తరించి ఉన్న ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.