చెన్నూర్లో సీపీఐ (అంబేద్కర్–మార్క్స్) ఏరియా సమావేశం
రాజ్యాంగ ఫలాలు అట్టడుగు వర్గాలకు అందేలా ఉద్యమాలకు పిలుపు
కోల్ బెల్ట్ న్యూస్(చెన్నూర్):
భారత కమ్యూనిస్టు పార్టీ (అంబేద్కర్–మార్క్స్) (సీపీఐ–ఏఎం) చెన్నూర్ ఏరియా సమావేశం శుక్రవారం చెన్నూర్లో రాతిపెల్లి నగేష్, నోముల సాంబయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ మంచిర్యాల జిల్లా కన్వీనర్ సంకె రవి హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, కారల్ మార్క్స్ తమ జీవితాలను ప్రజల సంక్షేమానికి అంకితం చేశారని అన్నారు. వారి ఆలోచనలు, పోరాటాల ఫలితంగానే భారతదేశంలో అట్టడుగు వర్గాలు, శ్రమజీవులకు గౌరవం, హక్కులు, సామాజిక గుర్తింపు లభించాయని పేర్కొన్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించినప్పటికీ, గత 79 ఏళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా విద్య, వైద్యం, ఉపాధి, గృహం, ఆహారం వంటి ప్రాథమిక హక్కులను పేదలు, అట్టడుగు వర్గాలు, శ్రమజీవులకు పూర్తిస్థాయిలో అందించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ఈ పరిస్థితుల కారణంగా దేశంలో పేదరికం, దోపిడీ కొనసాగుతుండటంతో సమగ్ర అభివృద్ధి సాధ్యం కాలేదని అన్నారు.
చెన్నూర్, జైపూర్, భీమారం, కోటపల్లి, వేమనపల్లి మండలాల ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని సంకె రవి పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో సీపీఐ (అంబేద్కర్–మార్క్స్) ఆధ్వర్యంలో వివిధ ఆందోళన, పోరాట కార్యక్రమాలను చేపడతామని ప్రకటించారు.ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.

by