Home » ఆదిలాబాద్ లో ఎవరివైపు ఆదివాసీలు

ఆదిలాబాద్ లో ఎవరివైపు ఆదివాసీలు

ADILABAD PARLAMENT …. ఆదిలాబాద్ అనడం కంటే అడవుల జిల్లా అంటేనే అందరికి తెలుసు. అడవులతో విస్తరించిన జిల్లాలో ఆదివాసీలు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆదివాసీలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరివైపు మొగ్గుచూపుతారో అంతుపట్టడంలేదు. పార్లమెంట్ లో అడుగుపెట్టడానికి భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానమైన మూడు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అభ్యర్థులు కూడా పోటా,పోటీగా ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఊహించని రీతిలో ఆదిలాబాద్ స్థానాన్ని బీజేపీ దక్కించుకొంది. తాజాగా ముగిసిన ఎన్నికల్లో ఇదే పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో నాలుగింటిని కాషాయం అభ్యర్థులే దక్కించుకున్నారు. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఢిల్లీ పెద్దలు ఉన్నారు.

ఆదిలాబాద్ (ST ) నియోజకవర్గంలో 16, 50, 175 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో తొమ్మిది తెగలకు చెందిన ఆదివాసీల సంఖ్య రెండు లక్షల ఇరువై వేల ఓటర్లు ఉన్నారు. బంజారా సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు లక్ష యాబై వేల మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు వర్గాలకు చెందిన వారిని ఒక్క గూటికి తీసుకు రావడమే రాజకీయ నాయకులకు పెద్ద తలనొప్పి. రెండు వర్గాలను ఎవరైతే ఏకతాటిపైకి తెచ్చుకుంటారో వారినే విజయం వరిస్తుంది. ఆదివాసీలకు, బంజారాలకు మధ్యం పచ్చ గడ్డివేస్తే బగ్గుమంటున్నది గత కొన్నేళ్లుగా. రాబోయే ఎన్నికల్లో మూడు పార్టీలు కూడా బంజారా వర్గానికి అవకాశం ఇవ్వలేదు.ఈ నేపథ్యంలో బంజారాలు భగ్గుమంటున్నాయి. బంజారాలు ఎవరికి చెయ్యెత్తుతారో, ఎవరిని ముంచుతారో కూడా అంతుపట్టడంలేదు. అదేవిదంగా తొమ్మిది తెగలతో పట్టుమీద ఉన్న ఆదివాసీలు కూడా ఏకతాటిపైకి రావడం కూడా కష్టమే. వీరు కూడా ఎవరికీ మద్దతు ఇస్తారో, ఎవరిని దూరం పెడుతారో తెలియక అభ్యర్థులు తలపట్టుకుంటున్నారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్టీలు కూడా సర్వేపై ఆధారపడే అభ్యర్థులను నిలబెట్టాయి. గోండు సామాజిక వర్గానికే టికెట్ కేటాయించారు. దింతో ఆదివాసీలు త్రిశంకుస్వర్గంలో పడిపోయారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సాయం బాపురావుకె ఆదివాసీలు పట్టం కట్టారు. కానీ ఇప్పుడు ముగ్గురు కూడా ఆదివాసీలు కావడంతో మూకుమ్మడిగా ఆదివాసీలు ఐక్యమయ్యే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి.

ఆదివాసీల హక్కుల కోసం పోరాటాలు చేసిన బిఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు వైపు ఆదివాసీలు నిలబడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. బంజారాలు మరో పక్షము వైపు వెళితే సక్కు గెలుపు అంత సులభం కాదనే అభిప్రాయాలు సైతం అడవుల జిల్లాలో వ్యక్తం అవుతున్నాయి. శాసన సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఆసిఫాబాద్ తోపాటు బోథ్ నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపొందింది. కానీ కాంగ్రెస్ మాత్రం కేవలం పార్లమెంట్ పరిధిలోని ఒకే ఒక్క ఖానాపూర్ స్థానాన్ని దక్కించుకొంది.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ కూడా ఉద్యమ నాయకురాలు. ఈమె విజయం కోసం మంత్రి సీతక్క భాద్యతలు తీసుకొంది. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గొడం నగేష్ ఆదివాసీల కోసం అంటీముట్టనట్టుగానే ఉన్నారు. నగేష్ కేవలం మోదీ నామం మీదనే ఆధారపడి పోటీలో ఉన్నారు. తొమ్మిది తెగలుగా ఉన్న ఆదివాసీల ఓట్లను చీల్చి, బంజారాలను తిప్పుకున్నవారికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 16,50,175 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మైనార్టీల బలం లక్ష యాబై వేల మంది ఓటర్లు ఉన్నారు. మైనార్టీలు కాషాయం అభ్యర్థికి మద్దతు ఇచ్చేఅవకాశం తక్కువ. ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కి 4,48,961 ఓట్లు పోలయ్యాయి. అదేవిదంగా గులాబీ పార్టీకి 4,65,476 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి 2,25,286 ఓట్లు పోలయ్యాయి. నాలుగు స్థానాల్లో కాషాయం జెండా ఎగురవేసిన పార్టీ మరింత పుంజుకొని తన స్థానాన్ని తిరిగి సాదించుకుంటుందా లేదా అనేది చూడాలి. అదేవిదంగా పట్టు కోల్పోయి, కారు దిగి వెళ్ళిపోతున్న వారితో ఇబ్బందులు పడుతున్న గులాబీ పార్టీ పోయిన పరువును ఎలా దక్కించుకోవాలో తెలియక సతమతమవుతోంది. మూడో స్థానంతో సరిపెట్టుకున్న ఖద్దరు పార్టీ . ఇప్పుడు కొత్తగా కండువా కప్పుకుంటున్న వారితో బలం పెంచుకొని విజయాపథకాన్ని ఎగురవేస్తుందా లేదా అనేది కూడా అనుమానంగానే ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో .

———————-
ఎడిటర్ : పీఆర్ యాదవ్
9603505050
———————–

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *