బస్సులు రాక వెలవెలబోతున్న బస్టాండ్
నిరుపయోగంగా బస్టాండ్
పట్టణవాసులకు అవస్థలు
రాజకీయకక్షల ప్రభావమే అంటున్న పట్టణవాసులు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే బోడ జనార్దన్ మందమర్రి పట్టణ వాసుల సౌకర్యార్తం ఆర్టీసీ బస్టాండ్ నిర్మించారు. ఆయన హయాంలో మంచిర్యాల నుంచి బెల్లంపల్లి, ఆసిఫాబాద్, నాగపూర్ వెళ్లే బస్సులు మందమర్రి బస్టాండ్ కు వచ్చి వెళ్ళేవి. ఉదయం నాలుగు గంటలకు మందమర్రి రైల్వే స్టేషన్ నుంచి భాగ్యనగర్ రైల్ కు వెళ్ళడానికి స్థానికులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా బోడ జనార్దన్ కల్పించారు. ఆయన 2004 లో ఓటమి చెందిన అనంతరం నుంచి బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. మందమర్రి బస్టాండ్ కు బస్సులు రాకపోవడం రాజకీయ కక్షలే అంటున్నారు పట్టణవాసులు.
బస్సులు రాకపోవడంతో పట్టణ వాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని TNSF పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు ఎండీ వాజీద్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మందమర్రిలో మాట్లాడుతూ బస్టాండ్ కు రవాణా సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, చిరు వ్యాపారాలు, కార్మిక కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట, బెల్లంపల్లి పట్టణాల్లోని బస్టాండ్ లకు ప్రధాన రహదారి నుంచే లోపలికి వెళుతున్నాయని, ఆ బస్టాండ్ లకు వెళ్లిన బస్సులు మందమర్రి బస్టాండ్ కు ఎందుకు రావడం లేదని ఆయన ఈ సందర్బంగా ప్రజాప్రతినిధులను, ఆర్టీసీ అధికారులను ప్రశ్నించారు.
కేవలం రాజకీయ కక్షలతోనే మందమర్రి బస్టాండుకు బస్సులు నడపడంలేదని ఆయన ఆరోపించారు. మందమర్రి బస్టాండ్ ను తెలుగు దేశం హయాంలో మాజీ మంత్రి బోడ జనార్దన్ నిర్మించారు. బస్సులు నడిపితే ఆయనకు, పార్టీకు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే బస్సుల నడపడంలేదని ఆయన ఆరోపించారు. జిల్లాలోని లక్సెట్టిపేట, బెల్లంపల్లి బస్టాండ్లకు ఒక నిబంధన ఉంటె, మందమర్రి బస్టాండ్ కు ఒక నిబంధన ఎలా ఉంటుందని వాజిద్ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే మందమర్రి బస్టాండ్ కు బస్సులు నడిపించాలని, లేనిచో తమ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే శాంతియుత పోరాటాలకు భాద్యత వహించాల్సి ఉంటుందన్నారు.

by