BRS : బిఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటే బిఆర్ఎస్.ఉద్యమంతో ఉవ్వెత్తున ఎగిసిన పార్టీ పదేళ్ల తరువాత చతికిలపడి పోయింది. అధికారం కోల్పోగానే నాయకులు దారులు వెతుకున్నారు. పార్టీ సమావేశాలు ఉంటె గతంలో గుంపులు, గుంపులుగా తరలివచ్చేవారు. కేటీఆర్ వస్తున్నారంటే అదో క్రేజీ. ఇంకా ఆయనతో సెల్ఫీలు. కేసీఆర్ కంటే ఎక్కువ యువత ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎప్పుడైతే పార్టీ పరాజయం పాలైనదో అప్పటినుంచి నాయకులు, కార్యకర్తలు కండువాలు మార్చుకోవడం మొదలుపెట్టారు. పార్టీ కార్యాలయాల ముఖం చూసేవారు కరువైపోయారు.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి కేటీఆర్ వస్తున్నారని మూడు జిల్లాల నాయకులకు సమాచారం అందించారు.130 మంది నాయకులను రావాల్సిందిగా కోరారు. కానీ పట్టుమని 40 మంది నాయకులు కూడా రాకపోవడంతో గులాబీ సమావేశం వెలవెలబోయింది. కేటీఆర్ వస్తున్నారని తెలిసి కూడా మూడు జిల్లాలకు చెందిన జిల్లా, రాష్ట్ర స్థాయిలో పదవులు పొందిన నాయకులు కూడా కేటీఆర్ సమావేశానికి డుమ్మా కొట్టడం విశేషం.
సమావేశానికి రాని నాయకులకు ఫోన్ చేసి రమ్మని కోరగా విచిత్రమైన సమాధానం రావడం విశేషం. ఎవరిని అడిగి పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిని నియమించారు. ఎవరి అభిప్రాయం తీసుకొని అభ్యర్థిని ఎంపిక చేసారు. అభ్యర్థి ఎంపిక సమయంలో అప్పుడు మేము గుర్తుకు రాలేదా అని ఫోన్ చేసి రమ్మని కోరిన నాయకులకు ప్రశ్నల వర్షం కురిసింది. అవతలి నుంచి నాయకుల ప్రశ్నల దాటికి కొందరు నాయకులు తట్టుకోలేక బిక్కమొహం వేసుకోవడం కనిపించింది.
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేయడానికి ఉత్సహం చూపారు. ఉద్యమం నుంచి పార్టీని నమ్ముకొన్నవారు ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ 2014, 2019 ఎన్నికల్లో రానివారు ఆశించారు. ఉద్యమంలో జైలు కు వెళ్లిన వారు ఉన్నారు. వీరందరిని కాదని తాజాగా గులాబీ గూటిలో చేరిన నాయకుడిని అభ్యర్థిగా ఎంపిక చేయడంతో మూడు జిల్లాల్లో అసంతృప్తి భగ్గుమంది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్ కు చెందిన బీజేపీ నాయకుడు రాకేష్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయనను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ ఎంపిక చేసింది. విజయం కోసం మూడు జిల్లాల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. కానీ ఆయన స్థాయికి తగిన విదంగా నాయకులు రాకపోవడంతో సమావేశం వెలవెల పోయింది. కొందరు అగ్రశ్రేణి నాయకులే గైర్హాజరు కావడం చర్చనీయాంశం అయ్యింది. పదేళ్లు రాజభోగం అనుభవించిన నాయకులు కూడా కేటీఆర్ సమావేశానికి దూరంగా ఉన్నారంటే గులాబీ పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. రాకేష్ రెడ్డి అభ్యర్థిత్వం ఇష్టం లేక రాలేదా ? పార్టీ అధికారంలో లేదని నాయకులు రాలేదా అనే అనుమానాలు సైతం వ్యక్తం కావడం విశేషం.