AP Elections : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఓటువేయడానికి జనం పోటెత్తారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద జనం తండోప తండాలుగా ఓటు వేయడానికి తరలివచ్చారు. ఓటు పడింది నిజమే. కానీ వేటు ఎవరికి పడుతుందో తెలియదు. జనం వచ్చారు. ఓటు వేశారు. జనం పోటెత్తారు.. వరం ఎవరికి వస్తుందో తెలియడంలేదు. ఫలితం ఎవరికి దక్కనుందో ఓటరు నాడి మాత్రం అంతుపట్టడంలేదు. పందెం కాసే వాళ్ళు హుషారుగానే ఉన్నారు.
2019 లో జరిగిన ఎన్నికల్లో 79.74 శాతం పోలింగ్ నమోదయినది. తాజా ఎన్నికల్లో ఆ రికార్డును ఓటర్లు తిరగరాశారు. 80 శాతం దాటినట్టుగా అధికారవర్గాలు వెల్లడించాయి. బ్యాలెట్ ఓటింగ్ శాతం కూడా భారీగానే నమోదయినట్టుగా సమాచారం. గతంలో కంటే తాజా ఎన్నికల్లో పెరిగిన ఓట్లు ఎవరిని ముంచుతాయో అంతుపట్టడంలేదు. అధికార పార్టీకు వరంగా మారాయి, లేదంటే కూటమికి అనుకూలంగా ఓటర్లు వేశారా అనేది అంతుపట్టడంలేదు. చేయించిన సర్వేలు, ఓటరు నాడి, పోలైన ఓట్ల సరళిని బట్టి పార్టీల నాయకులు గణాంకాల్లో మునిగిపోయారు.
నిర్ణిత సమయాన్ని మించి అర్థరాత్రి వరకు ఓటర్లు వరుసలో ఉండటం విశేషం. గడిచిన ఐదేళ్ల కాలంలో తాను ప్రవేశ పెట్టిన పథకాలే తనకు విజయాన్ని అందిస్తాయని వైసీపీ అధినేత జగన్ ధీమాలో ఉన్నారు. బస్సు యాత్రతో క్షణం తీరిక లేకుండా రోజులో జిల్లాను చుట్టి వచ్చారు సీఎం జగన్. రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. గెలుపు ధీమాలో ఉన్నారు.
టీడీపీ,జనసేన, బీజేపీ పార్టీలు ఏకమై కూటమిగా ఏర్పడ్డాయి. మోదీ ప్రచారంపై ఆశలు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. జగన్ పరిపాలనలో జరిగిన అవినీతి, భూ కబ్జాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగుల వ్యతిరేకత, ఉద్యోగుల్లో అసంతృప్తి వంటి అంశాలను ప్రచారం చేస్తూ కూటమి నాయకులు ఓటర్లను ఆకట్టుకోడానికి ప్రయత్నం చేశారు.