BJP : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఇంటి పన్నును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మీర్పేట మున్సిపాల్టీ కార్యాలయం వద్ద బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ప్రజలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీ రాముల యాదవ్ మాట్లాడుతూ పేద ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్ను పెంచాలన్నారు. అడ్డగోలుగా పన్నులు పెంచితే ప్రజలపై భారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నిర్మాణం ఆధారంగా పన్నుల కేటాయింపు కేటాయించాలన్నారు. కానీ నిబంధనలను పక్కనపెట్టి ప్రభుత్వం ఇష్టానుసారంగా పన్నులు పెంచితే ప్రజలు సహించరన్నారు.
ప్రజల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ, ప్రజలపై పన్నుల భారం వేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే సమయం కూడా తొందరలోనే ఉందన్నారు. మీర్పేట మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కరించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పెంచిన ఇంటిపన్ను వెంటనే తగ్గించాలని, అదేవిదంగా మున్సిపాలిటీ పరిధిలో అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని లేనిచో బీజేపీ చేపట్టే ఆందోళనలకు మున్సిపల్ అధికారులు భాద్యత వహించాల్సి ఉంటుందన్నారు.