జీఎస్ఐ ప్రాథమిక సర్వేలో కీలక సంకేతాలు
రూపురేఖలు మారనున్న కుప్పం నియోజకవర్గం
కోల్ బెల్ట్ ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్లో బంగారం గనుల అభివృద్ధికి కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా జొన్నగిరి బంగారం గనుల్లో ఉత్పత్తి ప్రారంభమైన నేపథ్యంలో, ఇప్పుడు చిత్తూరు జిల్లా కుప్పం పరిసర ప్రాంతాల్లో కూడా బంగారం నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమిక సంకేతాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక భౌగోళిక అన్వేషణలో, కుప్పం పరిసర ప్రాంతాల భూగర్భంలో స్వర్ణ ఖనిజాల ఉనికికి అనుకూల ఆధారాలు లభించినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో మరింత సమగ్ర అన్వేషణ అనంతరం వాణిజ్యపరంగా బంగారం తవ్వకాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
భౌగోళికంగా కుప్పం ప్రాంతం కర్ణాటకలోని ప్రసిద్ధ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF) మైనింగ్ బెల్ట్కు సమీపంలో ఉంది. ఈ మైనింగ్ బెల్ట్ విస్తరణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని కుప్పం వరకు కొనసాగి ఉండవచ్చని భూగర్భ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అంచనా వేస్తున్నారు. తాజా ప్రాథమిక సర్వేల్లో కుప్పం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో బంగారం ఖనిజాలకు అనుబంధంగా ఉండే రాతి నిర్మాణాలు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ నిక్షేపాల పరిమాణం, నాణ్యత, వాణిజ్యపరమైన సాధ్యతపై స్పష్టత రావాలంటే మరిన్ని శాస్త్రీయ సర్వేలు, డ్రిల్లింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.
అన్ని అనుమతులు పూర్తై ప్రభుత్వం గనుల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేస్తే, భవిష్యత్తులో కుప్పం కూడా ఆంధ్రప్రదేశ్లో కీలక బంగారం మైనింగ్ కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, అధికారికంగా తుది నివేదికలు వెలువడిన తర్వాతే బంగారం తవ్వకాలపై స్పష్టత రానుంది.

by