MP Etala Rajendar : హైదరాబాద్ లోని చెరువులను పరిరక్షించడానికి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ను అమలుచేస్తున్నారు. నా వాళ్ళు, నీ వాళ్ళు అని చూడకుండా అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. హైడ్రా పనితీరును హైదరాబాద్ వాసులు అభినందిస్తున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నాయకులు మాత్రం తట్టుకోలేక పోతున్నారు. హైడ్రా పైననే విమర్శలు చేస్తున్నారు. పేదలపైన హైడ్రా ప్రతాపం చూపిస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ రావ్ సీఎం రేవంత్ రెడ్డి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విధానం పై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నాగేశ్వర్ రావ్ వంటి సూడో మేధావులు సీఎం రేవంత్ రెడ్డి ని గొప్ప మేధావి, సంస్కర్త అని గొప్పగా ప్రశంసిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.
నాగార్జునకు చెందిన కన్వెన్షన్ మాత్రమే నాగేశ్వర్ రావ్ కు కనబడుతోంది. కానీ అనేక మంది పేదల ఇల్లు కూలగొడుతున్నది మాత్రం నాగేశ్వర్ రావ్ కు కనబడుటలేదా అని ఈటల రాజేందర్ నిలదీస్తున్నారు. పేదల ఇళ్లకు నోటిస్ ఇస్తే నాగేశ్వర్ రావ్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ అభిమానులు తెరమీదకు వచ్చారు. నాగేశ్వర్ రావును ట్రోల్ చేయడం ప్రారంభించడంతో మాజీ మంత్రి హరీష్ రావ్ రంగ ప్రవేశం చేశారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు పై బీజేపీ నాయకులు చేస్తోన్న దాడి ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావ్ ట్వీట్ చేశారు. రాజకీయ విమర్శలు అర్థవంతంగా ఉండాలన్నారు. భౌతిక దాడులు చేస్తామంటూ బీజేపీ చేస్తున్న హెచ్చరికలు మానుకోవాలంటూ హరిశ్ రావ్ ట్విట్ చేశారు. నేరుగా ఈటల రాజేందర్ ను అనకపోయినా… ఆ మాటలు వింటుంటే మాత్రం ఈటల రాజేందర్ ను ఉద్దేశించి అన్నట్టుగానే ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. హరీష్ రావ్ మాటలపై ఈటల రాజేందర్ ఏ విదంగా స్పందిస్తారో వేచి చూడాలి.