IPS Officers : ఆ జిల్లాకు ఎస్పీ గా వెళ్ళడానికి అధికారులు ఎందుకు వచ్చిన తలనొప్పి అంటున్నారు. అతిరథ మహారథులైన అధికారులు శాంతి భద్రతలను అదుపులో ఉంచారు. కానీ ఇప్పుడు సాధ్యం కావడంలేదు. ప్రస్తుతం చంద్రబాబు పరిపాలనలో కూడా ఎస్పీ గా వెళ్ళడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఐపీఎస్ అధికారులు వెళ్ళడానికి వెనక్కి తగ్గడానికి కారణాలు ఏమైనా ఉండవచ్చు. గడిచిన ఎనిమిది నెలల్లో ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. విధుల్లో ఎస్పీ గా చేరిన తరువాత ఎన్ని రోజులు ఉంటారో కూడా ఆ అధికారులకే తెలియడం లేదు. ఇంతకూ ఆ జిల్లా పేరు ఏమిటి అనుకుంటున్నారా ?
ఫ్యాక్షన్ పెట్టింది పేరు అనంతపురం జిల్లా. ఆ జిల్లాలో వెళ్లానుకుపోయిన ఫ్యాక్షన్ను కూకటివేళ్ళతో పెకలించి శాంతిభద్రతలను అదుపులో ఉంచిన శక్తివంతమైన ఎస్పీ లు ఉన్నారు. కానీ ఇప్పుడు అనంతపురం జిల్లాకు రావాలంటే ఆమ్మో అంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాకు బదిలీ అవుతున్నారు. కొద్దిరోజులకే ఏవో కారణాలు చెబుతూ మేము ఇక్కడ పనిచేయలేం. బదిలీ చేయండి అంటూ ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు.
అంజనా సిన్హా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, స్టీఫెన్ రవీంద్ర, ప్రస్తుత ఏపీ డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు తో పాటు ఎందరో ఐపీఎస్లు అనంతపురం జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వహించారు. గతంలో పనిచేసిన అధికారులు ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలను తమ కను సైగతో అదుపులో ఉంచారు. ఫ్యాక్షన్ మూలాలు జిల్లాలో లేకుండానే చేశారు. అనంతపురం జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో తాడిపత్రి నియోజకవర్గం ఒక్కటే ఐపీఎస్ అధికారులకు తలనొప్పిగా మారింది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాలను అదుపులో ఉంచుతున్న అధికారులు ఒక్క తాడిపత్రి నియోజకవర్గాన్ని మాత్రం అదుపుచేయలేక పోతున్నారని ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే ఉంది.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జిల్లా ఎస్పీ అన్బురాజన్ బదిలీ అయ్యారు. అయన తరువాత అమిత్ బర్దార్ భాద్యతలు చేపట్టారు. తాడిపత్రిలో పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు చెలరేగిన అల్లర్ల కారణంగా బదిలీపై వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన ఎస్పీ గౌతమి సాలి.. ఎన్నికల కౌంటింగ్ ను సమర్ధవంతంగా నిర్వహించి పేరు తెచ్చుకున్నారు.
ఎన్నికల కౌంటింగ్ ముగిసినకొద్ది రోజులకే ఎస్పీ గౌతమీ సాలి కూడా బదిలీ అయ్యారు. ఆ తరువాత కెవి మురళీకృష్ణ విధుల్లో చేరారు. విధుల్లో చేరిన నెల రోజులకే మురళీ కృష్ణ కూడా బదిలీ అయ్యారు. మురళి కృష్ణ స్థానంలో ఎస్పీ గా జగదీశ్ భాద్యతలు చేపట్టారు. ఆయన విధుల్లో చేరిన మరుసటి రోజుననే తాడిపత్రిలో అల్లర్లు చెలరేగాయి. అల్లర్లను అదుపులో ఉంచడానికి ఎస్పీ జగదీశ్ రెండు రోజుల పాటు తాడిపత్రిలోనే నిద్ర చేయాల్సి వచ్చింది.
ఈ విదంగా గడిచిన ఎనిమిది నెలల కాలంలోనే అనంతపురం జిల్లాకు ఐదుగురు ఎస్పీలు మారడం విశేషం. ఈ నేపథ్యంలో తాడిపత్రికి ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారిని నియమించాలనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. డిఎస్పీ అధికారి అయితే రాజకీయ ఒత్తిళ్లు వస్తాయి. కాబట్టి ఐపీఎస్ అధికారి అయితేనే తాడిపత్రి నియోజకవర్గాన్ని అదుపులో పెడతారనే అభిప్రాయాలు ఆ నియోజకవర్గం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.