Home » Police Boss : పదేళ్ల ఓపికకు పదోన్నతి

Police Boss : పదేళ్ల ఓపికకు పదోన్నతి

Police Boss : గ్రామపంచాయితీ అధికారి మొదలుకొని రాష్ట్ర స్థాయి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వరకు అధికార పార్టీ నాయకుల ఒత్తిడి సహజం. నాయకులకు అనుకూలంగా ఉన్న అధికారులకు కోరుకున్న ప్రాంతానికి బదిలీ, పదోన్నతి అందుతుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే సామెత మాత్రం నచ్చని, మెచ్చని అధికారులకు వర్తిస్తుంది. ఎంతటి ప్రతిభ ఉన్నా నాయకుల ముందు తల ఆడించిన వారికే అందలం దక్కుతుంది. లేదంటే ఎందుకు పనికి రాని పదవికి ఎంపిక అవుతారు. ఇదే పరిస్థితి సాక్షాత్తు కొత్త పోలీస్ బాస్ డీజీపీ శివధర్ రెడ్డి కి ఎదురైనది. ఆయన పదేళ్ల ఓపికకు పదోన్నతి దక్కింది. గులాబీ పరిపాలనలో ఎందుకు పనికిరాని పదవిలో కొనసాగడం విశేషం. అవసరానికి ఆయనను వాడుకొని, అవసరం తీరాక ఆయన నచ్చక పోవడంతో పనికిరాని పదవి కట్టబెట్టారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలలోకి వెళితే ……

తెలంగాణలో నయీం ఎన్‌కౌంటర్. పెద్ద నెట్ వర్క్ తో ఎంతో శోధించి సాధించిన ఎన్కౌంటర్ అది. ఆ ఎన్కౌంటర్ జరిగిన సమయంలో బాధ్యతల్లో ఉన్నది అప్పటి ఎస్పీ రమా రాజేశ్వరి కావచ్చు. కానీ వ్యూహరచన, ఆచరణ, నయీమ్ ఎత్తులకు పై ఎత్తులు వేసి కీలక పాత్ర పోషించి సాధించిన ఘనత మాత్రం తాజా డీజీపీ కే దక్కుతుంది. కష్టపడిన అధికారి మాత్రం ఇంటలిజెన్స్ చీఫ్ పదవి లో ఉన్న శివధర్ రెడ్డి. కానీ గొప్పలు ఆనాటి ప్రభుత్వంకు దక్కితే… తిప్పలు మాత్రం శివధర్ రెడ్డికి దక్కాయి.

నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన అనంతరం ప్రచారం జరిగింది అతని డైరీ, ఆస్తుల చిట్టా గురించి. రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో రకరకాలుగా ఎక్కువ ప్రచారం జరిగింది మాత్రం నయీమ్ డైరీ గురించి. డైరీ లో నయీమ్ రాసుకున్న విషయాలపైననే అనేక కథనాలు వినిపించాయి మీడియాలో. డైరీ ఆధారంగా ఎవరెవరి మెడకో నయీమ్ లింక్ కేసులు చుట్టుకోవడం ఖాయమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలు అప్పటి ప్రభుత్వానికి నచ్చలేదు. ఆ ఆరోపణల నేపథ్యంలో శివధర్ రెడ్డి కి అప్పటి ప్రభుత్వం ఒక మంచి బహుమతి ఇచ్చింది. చీఫ్ ఇంటిలిజెన్స్ పదవిలో ఉన్నఆయనకు ఐజీ పర్సనల్ పోస్ట్ కేటాయించింది. ఆ పదవి పక్కా లూప్ లైన్ . ఒక చిన్నగది. ఆ గది వద్దకు ఎవరు వెళ్లినా, మాట్లాడినా ప్రభుత్వానికి ఉప్పందుతుంది. ఆయనతో ఆరోగ్యకరమైన వాతావరణంలో కొనసాగిన వారు మాత్రమే ఆయన గదికి వెళ్లేవారు. వాళ్ళను కూడా లెక్కపెట్టవచ్చు.

అప్రధాన్యత పదవిలోనే ఆయన కోపం, కసి, ఓపిక, మౌనం దిగమింగుకున్నారు. కానీ ప్రభుత్వంతో సంధి కోసం ఏనాడు ప్రయత్నించలేదు. ఈ విషయం ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వారు ఎవరైనా నమ్ముతారు. ఇంతలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మకంగా పనిచేయడంతో సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకం ఏర్పడింది. తన పై నమ్మకం పెట్టుకున్న అధికారులను దగ్గరకు చేర్చుకోవడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనంతరం రేవంత్ రెడ్డి అనే పేరు వచ్చింది.

శివధర్ రెడ్డి ఎక్కువ కాలం ఇంటలిజెన్స్, ఎస్ఐబి, ఎస్పీ ఇంటలిజెన్స్, ఎస్ఐబీ డీఐజీ, ఐజీ ఇంటలిజెన్స్, డీజీ ఇంటలిజెన్స్ పదవుల్లో ఏళ్ల తరబడి కొనసాగారు. చంద్రబాబు, వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ల వద్ద మంచి పేరు సంపాదించుకున్నారు. 1994లో ఐరాస శాంతి పరిరక్షక దళంలో విధులు నిర్వహించారు. 2007లో మక్కా మసీదు బాంబు పేలుళ్ల అనంతరం సున్నిత ప్రాంతాల సౌత్ జోన్ డీసీపీగా భాద్యతలు చేపట్టి శాంతి భద్రతలను కాపాడారు. కొన్ని రోజుల పాటు కేసీఆర్ వద్ద కూడా మంచి అధికారిగ గుర్తింపు పొందారు. నయీమ్ ఎన్కౌంటర్ ఆయన ఓపికకు పరీక్షగా నిలిచింది. ఆ పదేళ్ల ఓపికకు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పదోన్నతి లభించడం విశేషం.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *