MLC KAVITHA : భారత రాష్ట్ర సమితిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఒక ప్రధానమైన నాయకురాలు. ఆమె ఏది మాట్లాడినా సంచలనం సృష్టించడానికే మాట్లాడుతారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇటీవల కవిత దూకుడు పెంచిందనే గుసగుసలు కూడా గులాబీ శ్రేణుల్లో మొదలైనాయి. ఆమె ఇటీవల మాట్లాడిన మాటలు గౌరవ అధ్యక్షుడు కేటీఆర్, లేదంటే అధినేత కేసీఆర్ మాట్లాడాల్సిన మాటలు. కానీ వారి పరిధి నుంచి బయటకు వచ్చి మాట్లాడేసరికి కవిత తన దూకుడు పెంచారనే అభిప్రాయాలు రాజకీయ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల బాన్సువాడలో ఎమ్మెల్సీ కవిత పార్టీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ మన పార్టీ కార్యకర్తలను, నాయకులను వేధించిన వారి పేర్లను పింక్ బుక్ లో రాసిపెట్టండి. వేధించిన వారిలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదంటూ కార్యకర్తలకు భరోసా నింపే ప్రయత్నం చేశారు. పార్టీలో పదవులు అనుభవించి, పార్టీని వదిలి వెళ్లిన వారు తిరిగి పార్టీలోకి వస్తామంటే తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ మాటలు మాట్లాడాల్సినది అధినేత కేసీఆర్, లేదంటే కేటీఆర్ మాట్లాడితే కాస్త బలంగా ఉండేది. కానీ కవిత ఈ మాటలు మాట్లాడేసరికి రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా తయారైనది.
బీసీ రిజర్వేషన్ల పెంపుపై పార్టీతో సంబంధం లేకుండానే దీక్షలు, నిరసనలు చేపట్టారు కవిత. ఈ వ్యవహారం కాస్త కేంద్రం పరిధిలోకి వెళ్లడంతో కవిత నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్లారు. ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో కవిత కేంద్రంతో కయ్యం పెట్టుకునే పరిస్థితిలో లేరు. ఆమె కేవలం రాష్ట్ర పరిధిలో మాత్రమే ఉంటారని, అందుకనే తన పట్టును పెంచుకోడానికి దూకుడు పెంచారనే అభిప్రాయాలు సైతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అందుకనే బిఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు కేటీఆర్ కంటే ముందుగా తనే కీలకమైన ప్రకటనలు చేస్తు పార్టీలో పట్టు పెంచుకోడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే అంటున్నారు గులాబీ శ్రేణులు.