YS JAGAN : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి….వైఎస్ఆర్ సీపీ అధినేత….ఇంకా చెప్పాలంటే రాష్ట్రానికి ప్రతిపక్ష హోదా లేని నాయకుడు. ఇప్పుడు ఆయన మనసు మార్చుకొని అసెంబ్లీ వెళుతున్నాడా ? లేదంటే అసెంబ్లీ సభ్యత్వం పోతుందనే భయంతో వెళుతున్నాడా ? ఈ విషయం తేలాలంటే జగన్ అసెంబ్లీ కి వెళితేనే తేలుతుంది.
జగన్ అసెంబ్లీకి వెళితే ఆయన తన నియోజకవర్గం సమస్యలపై స్పందించాలి. ఇంకా చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అప్పుడే ఆయనకు సభలో గౌరవవం దక్కుతుంది. ప్రజల్లో కూడా ఆదరణ వస్తుంది. కానీ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తే మాత్రం సమస్యల్లో చిక్కుకు పోవడం ఖాయం. చంద్రబాబు నాయుడికి ఎంత సమయం ఇస్తున్నారో, తనకు అంతే సమయం ఇవ్వాలని పట్టుబట్టడం కూడా సరికాదనే అభిప్రాయాలూ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
ఈ సమావేశాలకు జగన్ అసెంబ్లీకి వెళ్లకుంటే రాజ్యాంగం నిబంధనల మేరకు ఆయన ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో సమావేశాలకు వెళుతున్నారనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. సమావేశాలకు మొదటి రోజు వెళ్లి సంతకం చేసి సభ నుంచి వెళ్ళిపోతారనే అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవికి ఇక ఎలాంటి డోకా ఉండదు.
గత సమావేశాలకు జగన్ వెళ్లక పోవడంతో జగన్ కు సొంత ఇంటి పోరు తప్పలేదు. ఒక దశలో కాంగ్రెస్ అధ్యక్షురాలు, సోదరి షర్మిల కూడా జగన్ గైర్హాజర్ పై కూడ నిలదీసినంత పనిచేసింది. తనను నియోజక వర్గం ప్రజలు గెలిపిస్తే జగన్ ఎందుకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం లేదని ప్రశ్నించింది. ప్రజల సమస్యల కోసం వెళ్లకుండా, ప్రతిపక్ష హోదా కోసం పాకులాడుతున్నాడని కూడా షర్మిల నిలదీసినంత పనిచేసింది.
వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును అవమానించే రీతిలో కొందరు సభ్యులు మాట్లాడారు. అప్పుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది గౌరవ సభలా లేదు, కౌరవ సభలా ఉంది. మళ్ళీ నేను సభకు వస్తే గౌరవ సభకు వస్తాను అంటూ ఆవేదనతో వెళ్లిపోయారు. తిరిగి ఆయన గౌరవ సభలో అడుగుపెట్టారు. కానీ ఇప్పుడు జగన్ అసెంబ్లీకి వెళుతున్నారు. మరి చంద్రబాబు కౌరవ సభ ను నడుపుతారా, లేదంటే గౌరవ సభను నడుపుతారా అనేది కూడా వేచి చూడాల్సిందే.