ఇప్పటికే సారొచ్చారు
మరో ఇద్దరు యూనియన్ నేతలు కాంగ్రెస్ గూటికి ???
యూనియన్ లో మొదలైన అసంతృప్తి
కోల్ బెల్ట్ న్యూస్:కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ళపాటు అధికారానికి దూరంగా ఉంది.రాష్ట్రంనుంచి కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన వారిలో పలువురు ఎమ్మెల్యేలు గులాబీ గూటికి వెళ్లారు.రెండుదఫాలుగా పార్టీ ఇదే పరిస్థితిని ఎదుర్కొంది.అయినా పార్టీ శ్రేణులు జెండానే నమ్ముకొని ఉన్నారు. పార్టీ అనుబంధ సింగరేణి కార్మిక సంఘం INTUC నాయకులకు కూడా సింగరేణిలో గుర్తింపు హోదా లేదు. అయినా యూనియన్ నాయకులు సంఘాన్నినమ్ముకొనే ఉన్నారు.యూనియన్ పెద్ద నాయకులు సైతం ఎక్కడ అధికారం ఉంటె అక్కడికి పరుగులు తీయలేదు.రాష్ట్రంలో పదేళ్ల తరువాత పార్టీ అధికారంలోకి రావడంతో యూనియన్ నాయకుల్లో మితిమీరిన ఆత్మ విశ్వాసం పెరిగింది.సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలువాల్సిన సంఘాన్ని కార్మికులు ఆదరించలేదు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం లోపాలను INTUC సరిగా వాడుకోవడంలో విఫలమైనది అనే పేరు వచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో గెలుస్తామనే ధీమాలో యూనియన్ నాయకులు పడిపోవడంతోనే సింగరేణిలో పరాజయాన్ని మూటగట్టుకున్నామని పలువురు యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు.
యూనియన్ లో అసంతృప్తి ….
సింగరేణిలో యూనియన్ అధికారం కోల్పోయినప్పటికిని,రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉందనే ధీమాలో టీబీజీకేఎస్ నాయకులు పలువురు ఐఎన్టీయూసీ గూటికి చేరడానికి సిద్ధమయ్యారు.అధికారం కోల్పోగానే యూనియన్ లో చేరడానికి వస్తున్న విషయం తెలిసి కొందరు INTUC పెద్దలు యూనియన్ లో ఏ పదవి లేకుండా భర్తీ చేశారు.దీన్ని పసిగట్టిన బాణం నాయకులు మరో పాచికను సిద్ధం చేసుకున్నారు.ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరడం. ఆ తరువాత యూనియన్ చేరేవిదంగా పావులు కదపడం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. యూనియన్ లో చేరిన తరువాత యూనియన్ పదవులు ఎలా దక్కించుకోవాలో వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య.అందరు ఒకేసారి రాకుండా ఒక్కొక్కరుగా బాణం యూనియన్ ను వదిలిపెట్టి ముందుగా కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావ్ కాంగ్రెస్ లో చేరాడు. ఈయన చేరికతో ఐఎన్టీయూసీ లో అసంతృప్తి మొదలైనది. పదేళ్ళపాటు పార్టీ,యూనియన్ ను కాపాడుకుంటే అధికారం రాగానే పార్టీలో చేరడం ఎంతవరకు సమంజసమని పలువురు యూనియన్ నాయకులు అసంతృత్తిని వ్యక్తం చేస్తున్నారు.
మరో ఇద్దరు చేరికకు సిద్ధం …..
ప్రస్తుతం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరాడు.ఆయన చేరాడంటేనే యూనియన్ లో ప్రకంపనలు మొదలైనాయి. అయన రాజకీయ చాతుర్యం మరొకరికి అంతుపట్టదు.ఆయనను నమ్ముకుంటే అందలం.లేదంటే పాతాళమే దిక్కు.తాజాగా వెంకట్రావ్ బాటలోనే మరో ఇద్దరు టీబీజీకేఎస్ కీలక నేతలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోడానికి సిద్ధమవుతున్నారు.ఆ ఇద్దరు కూడా ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో తాజాగా మంతనాలు జరిపినట్టుగా కాంగ్రెస్ శ్రేణుల సమాచారం.పొంగులేటితో పాటు మంచిర్యాల జిల్లా లోని ఒక ఎమ్మెల్యే తో కూడా చేరికకు అవకాశం ఇవ్వాలని కోరినట్టుగా తెలిసింది.ఇదిలా ఉండగా పెద్దపల్లి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే మాత్రం ఆ ఇద్దరి చేరికపై పార్టీ శ్రేణుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసారని సమాచారం.ఈ నేపథ్యంలో యూనియన్ లో ఉన్న కీలక నేత ఒకరు వెంకట్రావ్ చేరికను అడ్డుకున్నప్పటికిని సాధ్యం కాలేదు. కనీసం వెంకట్రావ్ తో సఖ్యతగా ఉంటూ,ఆ ఇద్దరినీ అడ్డుకుంటే తనకు యూనియన్ లో భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదనే ఆలోచనతో ఉన్నాడని యూనియన్ శ్రేణుల సమాచారం. కానీ ఒక ఎమ్మెల్యే మాత్రం తన వ్యక్తిగత అవసరాల కోసం ఆ ఇద్దరు యూనియన్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల నాటికంటే ముందుగానే పార్టీ కండువా కప్పడానికి సిద్ధంగా ఉండటం కొసమెరుపు.