Mavoist Party : మాట చెప్పి పంపితే చాలు ముల్లెల కొద్ది పైసలు. చీటీ రాసి పంపితే క్షణాల్లో కట్టల కొలది డబ్బు. బీడీ కాంట్రాక్టర్, సివిల్ కాంట్రాక్టర్, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులను మావోయిస్టు పార్టీ అడిగిన వెంటనే కొందరు డబ్బు సమకూర్చిన రోజులు గతంలో ఉన్నవి. మావోయిస్టు పార్టీకి డబ్బుతో పాటు అవసరమైన దుస్తులు, మందులు, నిత్యావసర వస్తువులు, మందుగుండు సామాగ్రి, పేలుడు సామాగ్రి కూడా కొందరు సరఫరా చేసిన సందర్భాలు ఉన్నవి. మావోయిస్టులకు వీటిని అప్పగించడానికి వెళుతున్న సందర్భాల్లో అరెస్టు అయిన వారు కూడా ఎందరో ఉండటమే ఇందుకు తార్కాణం.
మానవ సామర్ధ్యంతో పాటు, ఆర్థిక వనరులను కూడా మావోయిస్టు పార్టీ బలోపేతం చేసుకొంది. ఈ నేపథ్యంలోనే దేశంలోని పలు రాష్ట్రాలకు పార్టీ విస్తరించింది. విధ్వంసాలను సృష్టిస్తూ తన ఉనికిని చాటుకొంది. సానుభూతి పరులు మినహా పార్టీలో చేరికలు కూడా లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టడంతో పట్టు ఉన్న కీలక నేతలు ఎన్కౌంటర్ లల్లో మరణించారు. మరణించిన వారిలో రాష్ట్ర కార్యదర్శులతో పాటు పొలిటి బ్యూరో సభ్యులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీని నడిపించే సత్తా ఉన్న నాయకులు నేలరాలడంతో పార్టీకి మేధాశక్తి కరువైనదనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక కష్టాలకు తోడుగా కీలక నేతల్లో చాలా మందికి వయో భారం, అనారోగ్యం కూడా తోడైనది.
ఒకవైపు కరోనా వ్యాధి, మరోవైపు కేంద్ర ప్రభుత్వం నోట్ల మార్పిడి, రెండువేల రూపాయల నోట్లను రద్దు చేయడం తో మావోయిస్టు పార్టీ ఆర్థిక ఇబ్బందులతో నెట్టుకొస్తున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం. కరోనా వ్యాధితో కొందరు కీలక నేతలు వివిధ రాష్ట్రాల్లో మరణించారు. దింతో మరణించిన వారు ఎక్కడెక్కడ డంపుల్లో పెట్టారో వాళ్ళకే తెలిసి ఉంటది. కొందరు కీలక నేతలు ఎన్కౌంటర్లో మరణించారు. వాళ్ళ చేతిలో ఉన్న డబ్బు కూడా వాళ్ళ అందుబాటులోనే ఉంటుంది. ముఖ్య0గా నోట్ల రద్దు మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిదంగా రెండువేల రూపాయల నోట్లను రద్దు చేయడంతో కూడా పార్టీకి ఆర్థిక నష్టాలు తెచ్చి పెట్టిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ నేపథ్యంలో నిధుల కోసం కీలక నేతలు అడవి దాటి వచ్చే పరిస్థితి ఏ మాత్రం లేదు. పోలీస్ వర్గాలదే ప్రస్తుతం పైచేయి అయ్యింది. డేగ కళ్ళతో అడవుల్లో నిఘా కొనసాగుతోంది. అడవుల్లో తలదాచుకొన్న మావోయిస్టుల సంఖ్య కంటే అడవుల్లో కూంబింగ్ చేపట్టిన పోలీస్ బలగాల సంఖ్య ఎక్కువగా ఉందని ప్రభుత్వ రికార్డ్ లు చెబుతున్నాయి. అబుజ్ మడ్ అడవులను జల్లెడ పడుతున్నాయి బలగాలు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఆర్థిక భారం తో పార్టీని ముందుకు తీసుకు వెళ్లడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం కావడం విశేషం.