KCR Coming : 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమం. తిరుగులేని శక్తిని సంపాదించుకొంది గులాబీ పార్టీ. పల్లె నుంచి పట్టణం దాకా గులాబీ జెండా రెపరెపలాడింది. పార్టీకి క్యాడర్ అనేది లేదు. ప్రజలే నాయకులై ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. ప్రత్యేక రాష్ట్రము ఏర్పడింది. అంతటి శక్తివంతమైన పార్టీ వరుసగా రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.
మూడోసారి కూడా అధికారం తమదేనని ధీమాలో కేసీఆర్ తో పాటు పార్టీ శ్రేణులు ఆశించారు. కానీ ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి. రాష్ట్రంలో అధికారం పోయింది. కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా ఉనికిని చాటుకుందామని ప్రయత్నాలు చేశారు. స్వయంగా అభ్యర్థుల గెలుపు కోసం అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. అయినా ఫలితం రాలేదు. ఏ ఒక్క అభ్యర్థి విజయం సాధించలేదు. చాల నియోజకవర్గాల్లో మూడో స్థానంలోకి వెళ్ళింది పార్టీ.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక రంగాలకు పార్టీ పెద్ద పీట వేసింది. 2014 లో అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర సాధన కోసం పనిచేసిన సంఘాల కోసం పట్టించుకోలేదని పేరు మూటగట్టుకుంది. అదేవిదంగా ఉద్యమంలో విద్యార్ధి సంఘాలు జైలు కు వెళ్లాయి. రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఇప్పటికి కూడా విద్యార్ధి నాయకులు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గడిచిన పదేళ్ల కాలంలో విద్యార్ధి సంఘం కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా కనబడలేదు.
పార్టీకి పెద్ద దిక్కు అయినటువంటి పొలిటికల్ బ్యూరో కూడా నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్ళింది. పార్టీకి జిల్లా అధ్యక్షులుగా చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యే లు, ఎంపీ లే ఉన్నారు. పార్టీని నమ్ముకున్న వారితోపాటు, ఉద్యమం నాటి నుంచి జెండా మోసిన వారిలో అధిక శాతం నాయకులకు మొండి చేయి చూపించింది పార్టీ.
పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలంటే పార్టీ శ్రేణుల్లో ఎవరితోనూ సాధ్యం కాదు. చివరకు కేటీఆర్, హరీష్ రావ్ లు రంగంలోకి దిగి పార్టీ భాద్యతలు భుజాన వేసుకున్నా పార్టీ బతికి బట్ట కట్టే పరిస్థితి కనబడుటలేదు. కేవలం అపార అనుభవం ఉన్న అధినేత కేసీఆర్ తోనే పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడం సాధ్యం అవుతుందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తం కావడం విశేషం. పార్టీ ఎన్నికల ప్రచారం ముగిసిన నాటి నుంచి కేసీఆర్ ఇంటికే పరిమితం అయ్యారు. ఇప్పుడు పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి కేసీఆర్ పక్కా కొత్త ప్రణాళికతో ప్రజల్లోకి రావడానికి సిద్దమయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.