CM : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియాతో చిట్, చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైతే ఆమరణ దీక్ష కు కూడా తాను సిద్దంగానే ఉన్నానని చిట్ చాట్ లో స్పష్టం చేశారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి తోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ను ఓడించి.. సీఎం కుర్చీలో నుంచి దింపింది తానే అన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా వచ్చిందంటే కారణం తానేనని, ఈ విషయాన్ని కూడా కేటీఆర్ గుర్తుంచుకోవాలన్నారు రేవంత్రెడ్డి. స్టేటస్ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారు.. అసలు కేటీఆర్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే విషయాల గురించి తెలుసుకున్న తరువాత నే కేటీఆర్ స్టేటస్ గురించి మాట్లాడాలన్నారు. క్రిమినల్స్ ఎప్పుడు కూడా కేసులకు భయపడరు. కేసులకు భయపడే వారు క్రైమ్ చేయరు. అందుకే కేటీఆర్ భయపడను అంటున్నారంటూ సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. కేటీఆర్ గురించి మాట్లాడడం కూడా అనవసరం అంటూ ఎద్దేవా చేశారు.
కిషన్రెడ్డిపైనా రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నేనే మెట్రో తెచ్చానంటున్నారు కిషన్రెడ్డి. కిషన్రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుంది? అని సీఎం రేవంత్ ఎదురు ప్రశ్నించారు. తెలంగాణకు కిషన్రెడ్డి నిధులుతెస్తే సన్మానం చేస్తానని చెప్పాను. కనీసం అఖిలపక్ష భేటీకి కూడా కిషన్రెడ్డి రాలేదని విమర్శించారు. కిషన్రెడ్డి కేంద్రం నుంచి నిధులు తెస్తే వద్దంటామా..? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలపై ఉమ్మడి పోరాటం కోసం అఖిల పక్షం పెడితే బీజేపీ వాళ్లు రాలేదు. బహుశా కేసీఆర్ ఏమన్నా అంటాడేమోనని అఖిలపక్ష సమావేశానికి రాలేదనుకుంటున్న అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్రాలను బీజేపీ సమానంగా చూడటం లేదు. తెలంగాణ కడుతున్న పన్నులు ఎంత. తిరిగి కేంద్రం కేటాయించిన నిధులు ఎంత..? చర్చకు వస్తానంటే సీఎంగా తాను, భట్టి చర్చకు రావడానికి సిద్ధమని కిషన్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. బుల్లెట్ ట్రైన్ గుజరాత్ ఇచ్చారు.. తెలంగాణ ఎందుకు ఇవ్వడం లేదంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 99 సార్లయినా ఢిల్లీ వెళ్తాను. తాను ఢిల్లీకి వెళ్లడం వల్లనే హైదరాబాద్లో అభివృద్ధి కావాల్సిన క్లియరెన్స్ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.