CM Revanth Reddy : కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. సొంతంగా కాంగ్రెస్ పార్టీకి 125 సీట్లు వచ్చిన ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమంటున్నారు. ఇండియా కూటమి లోని పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తాయంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటల ప్రకారం ఇప్పుడున్న ఇండియా కూటమిలోని పార్టీలన్ని కూడా ఫలితాల అనంతరం ఒకే గొడుగు కింద ఉంటాయా అనే అనుమానాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆశగా ఉండవచ్చు. కానీ ఇండియా కూటమిలో యోధాను యోధులు ఉన్నారు. ఫలితాల అనంతరం ఇప్పుడున్నట్టే ఐక్యంగా ఉంటారనేది కూడా నమ్మకం తక్కువే.
నిజంగానే కాంగ్రెస్ కు కొంచెం అటు, ఇటుగా 125 సీట్లు వస్తే ఇండియా కూటమిలోని ఎన్ని పార్టీలు ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇస్తాయనేది ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. మమతా బెనర్జీ తాజా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఆమె తన లక్ష్యానికి అనుగుణంగా సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. చివరి నిమిషంలో ఆమె బీజేపీ కి మద్దతు ఇస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న కూడా రాజకీయ మేధావుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రము అవసరాల రీత్యా బీజేపీతో జతకడితే కాంగ్రెస్ కు ఇబ్బంది తప్పదు.
మమతా బెనర్జీ బీజేపీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో బీజేడీ, ఎన్సీపీ పార్టీలు కూడా ఆమె దారిలో నడవక తప్పదు. అదేవిదంగా ఏపీ నుంచి జగన్ మోహన్ రెడ్డి కూడా ఇండియా కూటమికి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. గడిచిన పదేళ్ల బీజేపీ పరిపాలన చూస్తున్నాం. కాబట్టి రాష్ట్రాల అభివృది, రాజకీయ అవసరాలు, వ్యక్తిగత అవసరాల నేపథ్యంలో కూడా బీజేపీ తో జతకలిసినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి రావచ్చు. బీజేపీ కి సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేనప్పుడు పలు పార్టీల మద్దతు కోరే అవసరం కూడా ఏర్పడవచ్చు. అటువంటప్పుడు నమ్మకమైన వారితో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.