Home » BRS : ప్లీనరీపై ఆశలు పెట్టుకున్న గులాబీ నేతలు

BRS : ప్లీనరీపై ఆశలు పెట్టుకున్న గులాబీ నేతలు

BRS : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కేసీఆర్ స్థాపించారు. ఆ తరువాత పార్టీని భారత రాష్ట్ర సమితిగా నిర్మించారు. రాష్ట్ర సాధన కోసం పురుడు పోసుకున్న పార్టీకి పాతికేళ్లు నిండబోతున్నాయి. రాష్ట్రం సాధించుకున్న పార్టీకే తెలంగాణ ప్రజలు పదేళ్ల పాటు పట్టం కట్టారు. 2023 ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీగా భాద్యతలు అప్పగించారు ప్రజలు. ఈ నేపథ్యంలో పార్టీ పరిస్థితి కార్యకర్తలకు దూరమై పోయింది. ప్రతిపక్ష పార్టీగా పోరాడుతున్నప్పటికీ ప్రజల నుంచి ఆశించిన ఫలితం రాకపోవడం కూడా కార్యకర్తలను నిరాశపరుస్తోందనే అభిప్రాయాలూ సైతం పార్టీలో వ్యక్తమవుతున్నాయి. అధికారం కోల్పోయినప్పటికీ, కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా కనీసం ఒకటో, రెండో సీట్లు సాధిస్తామని పార్టీ ద్వితీయశ్రేణి నాయకత్వం ఆశించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పార్టీ ఉనికిని కాపాడుకోలేకపోవడంతో కార్యకర్తలు ఆవేదన చెందక తప్పలేదు.

ఈ నేపథ్యంలో ఒకవైపు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే, మరోవైపు ప్రజా సమస్యలపై ఉద్యమ బాట పట్టాలని పార్టీ సమీక్ష సమావేశాల్లో నిర్ణయించినట్టు సమాచారం. పాతికేళ్ల సందర్భాన్ని పురస్కరించుకొని ఉద్యమానికి బాట వేసి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఉక్కిరి, బిక్కిరి అవుతున్న పార్టీకి ఊపిరి పోయడానికి వేదికగా ప్లీనరీ ని ఎంచుకున్నారు అధినేత కేసీఆర్. వరంగల్ జిల్లాలో ప్లీనరీ ని భారీ ఎత్తున నిర్వహించి ప్రజా బలంలో తిరుగులేదని చాటి చెప్పడానికే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు.

ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అకారణంగా సస్పెండ్ చేశారని, ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కానీ పార్టీ ఆశించిన ఫలితం రాలేదు. ఎదో మమా అనిపించారు. అనుకున్నంత క్యాడర్ నిరసన కార్యక్రమంలో పాల్గొనలేదు. కవిత ను అరెస్ట్ చేసినప్పుడు కూడా ముఖ్య నేతల్లో కొందరు మాత్రమే రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. నల్లగొండలో నిర్వహించిన రైతు సభకు హాజరైన జనం కూడా అంతంత మాత్రమే తరలి రావడం కూడా పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ క్యాడర్ ఇంకా బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.

పార్టీ భవిష్యత్ పై సొంత ముఖ్యనేతలే అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలోనే పది మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం జరిగిందని ఓ సమావేశంలో కేసీఆర్ కొందరు నాయకులపై మండిపడ్డారన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. బీఆర్ఎస్ భవిష్యత్ పై ప్రథమశ్రేణి నాయకుల్లో కూడా సందేహాలు ఉన్నాయని పలువురు జిల్లా స్థాయి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితితులను గమనిస్తే ద్వితీయ శ్రేణి నాయకత్వంలో పార్టీ పరిస్థితి ఏ మేరకు ఉందొ చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి సమయంలో పార్టీ అగ్రనాయకత్వం ఏం చేయాలి.. పార్టీ భవిష్యత్ కు ఢోకా లేదన్న నమ్మకం కలిగించాలి.

కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా ఉత్త మాటలు చెబితే ధైర్యం ఎలా వస్తుందని కొందరు నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. జిల్లాల పర్యటనలు చేపట్టాలని కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ క్యాడర్ ను బలోపేతం చేయడానికే జిల్లా పర్యటనలు ఖరారు చేసినట్టు సమాచారం. వరంగల్ ప్లీనరీ సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేసి బలం చూపించడానికి పార్టీ సిద్దమవుతున్న నేపథ్యంలో ఏ మేరకు సఫలం అవుతుందో వేచి చూడాల్సిందే.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *