Thirupahi Venkateswara Swami : ఆపద మొక్కుల వాడు. వడ్డికాసులవాడు. కలియిగ అవతార పురుషుడు. ఆపద్బాంధవుడు, శ్రీనివాసుడు, గోవిందుడు. ఇలా ఎన్నో నామాలతో ఏడుకొండలపై వెలసిన తిరుమల, తిరుపతి వెనటేశ్వర స్వామి ని ప్రత్యక్షంగా చూడాలంటే రెండు కళ్ళు చాలవు. తమ కోరికలు నెరవేరినందుకు భక్తులు స్వామి ని దర్శించుకుంటారు. కానుకలు సమర్పిస్తారు. మరికొందరు తలనీలాలు సమర్పించు కుంటారు. ఇంతకు శ్రీనివాసునికి తలనీలాలు ఎందుకు ఇవ్వాలి. భక్తుడు తలనీలాలు ఇస్తుంటే స్వామికి ఎందుకంత ఇష్టం. అసలు ఆ సంప్రదాయం ఎందుకు వచ్చింది. ఈ తలనీలాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా ? అయితే చదవండి … ఇది పూర్తిగా వెంకటేశ్వర స్వామి చరిత్ర ఆధారంగా రాయబడింది. ….
త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో తెలుసుకోడానికి భృగు మహర్షి ముల్లోకాలకు వెళుతాడు. ఆ సమయంలో పాలకడలిలో శేషతల్పంపై వైకుంఠంలో మహావిష్ణువు మహాలక్షిమిని తన వక్ష స్థలంపై నిలుపుకొని వైభోగంగా ఉంటాడు. అదిచూసి మహర్షి ఈర్ష్యతో ఆయన వక్ష స్థలంపై కాలితో తన్నుతాడు. ఆ సంఘటన నచ్చక మహాలక్ష్మి వైకుంఠం విడిచి కోపంతో కొల్హాపూర్ వెళ్ళిపోతుంది. లక్షిదేవి లేకుండా నేను వైకుంఠంలో ఉండలేనని ఆవేదనతో విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి అవతారంలో భూలోకం చేరుకుంటాడు. లక్ష్మీదేవిని వెతుకుంటూ భూలోకంలో తిరిగి అలసిపోయి ఒక పుట్టలో నివాసం ఏర్పరచుకొని ఉంటాడు. ఇది గమనించిన ఒక ఆవు వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న విష్ణుమూర్తి ఆకలి తీర్చటానికి అక్కడికి వచ్చి పుట్టలోకి పాలధారను కార్చుతుంది. రోజు పాలు ఇచ్చే ఆవు తనకు ఇంటికి వచ్చాక ఇవ్వకపోవడాన్ని గమనించి ఏమైనది అంటూ ఆవు కోసం వెతుకుతాడు యజమాని గొల్లవాడు. ఆవు దేవుని రూపంలో ఉన్న శ్రీనివాసుడికి పాలు ఇస్తుందని తెలియక గొల్లవాడు గొడ్డలితో శ్రీనివాసుడి తలపై కొడుతాడు.
గొల్లవాడు కొట్టిన దెబ్బకు గాయం కావడంతో నుదుటిపై అక్కడే ఉన్న నీలా అనే వ్యక్తి ఆకుపసరు పూసి వైద్యం చేస్తుంది. గాయం కావడంతో శ్రీనివాసుడి నుదిటిపై వెంట్రుకలు తొలగిపోతాయి. వెంట్రుకలు పోయిన స్థానంలో నీలా తన తల వెంట్రుకలు తీసి శ్రీనివాసుడికి కట్టి కట్టు కడుతుంది.అందుకు మెచ్చి శ్రీనివాసుడు నా దర్శనానికి వచ్చిన భక్తుడు ఇచ్చే తల నీలాలు నీకె చెందేలా వరమిస్తున్నాను అని చెప్పి వరమిస్తాడు. కలియుగం ఉన్నంత వరకు నీలా భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు తాను తిరుమలలో వెలసిన తరువాత తన దర్శనానికి విచ్చేసిన భక్తులు తన మీద భక్తితో ఇచ్చిన తలనీలాలన్నీ నీలాకు చెందేలా వరమిస్తాడు. అంతేకాకుండా కలియుగాంతం వరకు ఇది ఇలాగే కొనసాగుతుందని అభయమిస్తాడు.అప్పటి నుంచి నేటివరకు స్వామిని దర్శించుకున్న భక్తులలో అధికమంది తమ తలనీలాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది.