Home » గోల్కొండలో ఘనంగా ఆషాఢ బోనాల ఉత్సవాలు

గోల్కొండలో ఘనంగా ఆషాఢ బోనాల ఉత్సవాలు

శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పణ
మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాల సమర్పణ
రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు బోనాల సంబరాలు
భక్తి శ్రద్దలతో మొక్కులు చెల్లించుకోనున్న భక్తులు

కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):

తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్సవాలు గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి బుధవారం తొలి బోనం సమర్పించడంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ తొలి బోనంతో రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు కొనసాగే బోనాల మహోత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ఆలయాల్లో భక్తులు తమ మొక్కులు తీర్చుకోనున్నారు. ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగను జరిపించడానికి తెలంగాణ ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

ఉత్సవాల సందర్భంగా గోల్కొండ కోటకు తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు తలపై అలంకరించిన బోనాలను మోసుకుంటూ భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించగా, పోతురాజుల విన్యాసాలు, డప్పుల మోతలు, జానపద కళారూపాలు ఆలయ పరిసరాలను భక్తి పారవశ్యంతో నింపాయి. “జై మహంకాళి” నినాదాలతో గోల్కొండ కోట ఆధ్యాత్మిక వాతావరణంలో మార్మోగింది.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. గోల్కొండలో ప్రారంభమైన ఈ బోనాల ఉత్సవాలు రానున్న రోజుల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం, హైదరాబాద్ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహంకాళి దేవాలయాల్లో అత్యంత వైభవంగా కొనసాగనున్నాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *