వరంగల్ కాంగ్రెస్లో విభేదాలు బహిర్గతం..
కడియం శ్రీహరిపై సీఎంకు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు
కోల్ బెల్ట్ న్యూస్(వరంగల్):
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి మూడు పేజీల లేఖ రాయడంతో విభేదాలు గుప్పుమన్నాయి.
ఆ లేఖలో ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తూ, తన శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికంగా జోక్యం చేసుకుంటున్నారని, దీనిపై తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరినట్లు అధికార పార్టీ వర్గాల సమాచారం.
మంత్రి తన లేఖలో ముఖ్యంగా దేవాదాయ శాఖ పరిధిలోని అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తాను శాఖా మంత్రిగా ఉన్నప్పటికీ, దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారిక సమీక్ష సమావేశాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిర్వహిస్తున్నారని ఆమె తన లేఖల్లో ఆరోపించారు. వరంగల్ ప్రాంతంలోని పలు చారిత్రాత్మక దేవాలయాల మాస్టర్ ప్లాన్లపై అధికారులకు నేరుగా ఆదేశాలు ఇస్తున్నారని ఆమె ఆ లేఖలో వివరించారు.
ఒక క్యాబినెట్ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో, ఎమ్మెల్యే హోదాలో తన శాఖా పరమైన సమీక్షలు నిర్వహించడం, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ప్రోటోకాల్కు విరుద్ధమని మంత్రి అభిప్రాయపడినట్లు తెలిసింది. అలాగే, మంత్రిగా తనకు సమాచారం ఇవ్వకుండానే ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశాలకు అధికారులు హాజరు కావడంపై కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు? పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనే అంశాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.

by