అందుకే పార్టీ ఏర్పాటుకు దూరం
సరైన సమయం కోసం నిరీక్షణ
Mlc kavitha : ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం జన జాగృతి బాటలో ఉన్నారు. గులాబీ శ్రేణుల్లో ఎవరి గురించి ఆమె ఎప్పుడు ఏమి మాట్లాడుతారో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకే ఆమె అంటేనే పలువురు జంకుతున్నారు. కవిత ఇటీవల మాట్లాడిన మాటలకు ఎమ్మెల్యే కృష్ణారావు గట్టిగానే స్పందించారు. ఆమెను కుక్కతో పోల్చారు. అంటే ఆయనకు పార్టీలో పెద్ద బలం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ కూతురు అని కూడా ఆయన ఆలోచించలేదు. కానీ పార్టీకి పెద్ద దిక్కు తానే కావాలని, అందుకోసమే నిత్యం పార్టీ సీనియర్ నేతలను ఆమె లక్ష్యంగా చేసుకొందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
హరీష్ రావును ఎలాగయినా పార్టీ నుంచి వెళ్ళగొట్టాలని కవిత కుట్ర పన్నుతోందని కృష్ణా రావు ఆరోపించారు. జరగరానిది ఏదయినా జరిగి కేసీఆర్ ఏదయినా ఒక నిర్ణయం తీసుకుంటేనే హరీష్ రావు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారు. అప్పుడు కవిత కోరికల్లో ఒక కోరిక తీరినట్టు అవుతుంది. ఇదే జరిగితే కూడా పార్టీకి పెద్ద నష్టమే. అయన బలమేమిటో కేసీఆర్ కూడా తెలుసు.
సీఎం రేవంత్ రెడ్డి తో కవిత కుమ్మక్కై కేటీఆర్ ను జైలుకు పంపడానికి కుట్ర పన్నుతోందని ఎమ్మెల్యే కృష్ణా రావు ఆరోపించారు. కేటీఆర్ కేసుల విషయం నానుతూనే ఉంది. ఒకవేళ అదే నిజమయితే అప్పుడు పార్టీకి పెద్ద దిక్కు అవసరం. అసలే అధినేత కేసీఆర్ ఆరోగ్యంపై వివిధ రకాల పుకార్లు వస్తున్నాయి. వీటిని కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఖండించడం లేదు.
కేటీఆర్ జైలు కు వెళ్లడం, హరీష్ రావు పార్టీ నుంచి వెళ్లిపోవడానికి అధినేత అనారోగ్యం కూడా తోడైతే అప్పుడు కవిత రంగంలోకి దిగడం ఖాయ మంటున్నారు రాజకీయ పరిశీలకులు. అందుకే ఆమె జనం నాడీ తెలుసుకోడానికి ముందు జాగ్రత్తగా జాగృతి బాట పట్టారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అందుకోసమే ఆమె పార్టీ కూడా నిర్మాణం చేయడం లేదంటున్నారు విశ్లేషకులు. సరైన సమయం కోసం ఒకవైపు ఎదురు చూస్తూనే ఆమె తండ్రి స్థాపించిన పార్టీ ని కాపాడుకోడానికి జన జాగృతి బాట పట్టారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.
———————————-

సిహెచ్ పరశు రాం
పొలిటికల్ బ్యూరో
9603505050
———————————-

by