BRS : భారత రాష్ట్ర సమితి నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సన్నద్ధ మవుతోంది. ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ ఎన్నికల కమిషన్ ను కలువడం చర్చనీయాంశం అయ్యింది. గత ఎన్నికల్లో పార్టీ గుర్తును పోలి మరికొన్ని గుర్తులు ఉండటంతో పార్టీ అభ్యర్థులు నష్టపోయారంటూ బిఆర్ఎస్ నాయకులు కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
తమ పార్టీ కారు గుర్తు పోలికతో చపాతీ రోలర్, కెమెరా, షిప్ గుర్తులు ఉన్నాయంటూ బీఆర్ఎస్ మాజీ ఎంపీ బొయిన్పల్లి వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. షిప్-3,233, కెమెరా- 9,051, చపాతి రోలర్- 60,125 ఓట్లు పోలు కావడంతో తమ పార్టీ అభ్యర్థుల్లో కొందరు ఓటమిపాలు అయ్యారని కమిషన్ కు వివరించారు.
ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీచేసే వారికి రాబోయే ఎన్నికల్లో ఈ గుర్తులు కేటాయించవద్దని కమిషన్ ను కోరారు. అదే విదంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ మూడు గుర్తులను తొలగించాలని కోరారు. పోటీలో ఉండే అభ్యర్థులకు కూడా కేటాయించరాదని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు కారు గుర్తును పోలి ఉన్న గుర్తుల వలన 72,409 ఓట్లు నష్టపోవాల్సి వచ్చిందని కమిషన్ కు వారు వివరించారు.

by