కోల్ బెల్ట్ న్యూస్(చెన్నూర్):
చెన్నూరు పట్టణంలోని పలు వార్డుల్లో ప్రజలు కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక సౌకర్యాలు అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని భారత కమ్యూనిస్టు పార్టీ (అంబేద్కర్–మార్క్స్) జిల్లా కమిటీ ఆరోపించింది.సోమవారం చెన్నూర్ పట్టణంలో పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్బంగా పార్టీ జిల్లా కన్వీనర్ సంకె రవి, జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యుడు దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ …
చెన్నూర్ పట్టణంలో కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమల నివారణ మందుల పిచికారీ వంటి పనులు సక్రమంగా జరగడం లేదని విమర్శించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం గానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ చెన్నూరు పట్టణ అభివృద్ధిపై తగిన శ్రద్ధ చూపలేదని వారు ఆరోపించారు. అంబేద్కర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ, మారమ్మవాడ, శిశుమందిర్ ప్రాంతాల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయన్నారు. డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో భరించలేని దుర్వాసన వ్యాపిస్తోందని, దోమలు, పిచ్చి మొక్కలు, పాములు, పందులు, వీధి కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి చెన్నూరు పట్టణంలోని అన్ని కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (అంబేద్కర్–మార్క్స్) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాతిపెల్లి నగేష్, బోండ్ల సరిత, బోయిరే రమాదేవి, నోముల సాంబయ్యతో పాటు ఆయా కాలనీల ప్రజలు పాల్గొన్నారు.

by