BJP : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికలో ఢిల్లీ పెద్దలు పరిశోధనల్లో మునిగిపోయారు. ఒకరి తరువాత, మరొకరి పేరు తెరపైకి వస్తోంది. ఆశలు పెట్టుకున్న నేతలు కూడా భారీగానే ఉన్నారు. ఎవరు రాష్ట్ర పగ్గాలు చేత పడుతారో కూడా అంతుపట్టడం లేదు. అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న నాయకుల అనుచరులు కూడా ఉత్కంఠతో ఉన్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, రామచంద్ర రావు, ధర్మపురి అరవింద్ పేర్లు నిన్నటి వరకు చర్చలకు అనుకూలంగా కనపడినవి.
బీజేపీ మాతృ సంస్థ సంఘ్ పరివార్ కనుసన్నల్లోనే రాష్ట్ర అధ్యక్ష ఎంపిక జరుగబోతోందనేది స్పష్టంగా కనబడుతోంది. మొదటి నుంచి సంఘ్ నుంచి ఎదిగిన వ్యక్తికే పట్టం కట్టాలని సంఘ్ పట్టుదలతో ఉంది. సంఘ్ నుంచి వచ్చిన నాయకుడైతేనే పార్టీతో పాటు సంఘ్ పరివార్ లో కూడా ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందనేది స్వయం సేవకుల వాదన. పార్టీ లో కూడా స్వయం సేవకుల వాదనను కొందరు తిరస్కరించలేక పోతున్నారు. మరికొందరు పార్టీ పెద్దలు సంఘ్ వాదనను సమర్థిస్తున్నారు.
ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో గాని, తెలంగాణ రాష్ట్రంలో కానీ సంఘ్ లేదంటే ఏబీవీపీ నుంచి వచ్చిన వారే అధ్యక్ష భాద్యతలు చేపట్టిన వారు ఉన్నారు. ఇప్పుడు కూడా అయితే స్వయం సేవక్ లేదంటే విద్యార్థి పరిషత్ నాయకత్వం నుంచి వచ్చిన వారే రాష్ట్ర భాద్యతలు చేపట్టాలని RSS వాదిస్తోంది. వారి వాదనకు తగినట్టుగానే బీజేపీ ఢిల్లీ పెద్దలు ” తల్లోజు ఆచార్య “పేరును పరిశీలిస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.
” తల్లోజు ఆచార్య ” స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా అమనగల్ గ్రామం. బీసీ సామజిక వర్గం. విద్యావంతుడు. ఆరెస్సెస్, ఏబీవీపి నుంచి వచ్చిన నాయకుడు. సంఘ్ పరివార్ తో తత్సంబంధాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష భాద్యతలు కూడా ఆచార్య నిర్వహించారు.1994 నుంచి 2023 వరకు వరుసగా ఆరుసార్లు కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014 లో 78 ఓట్ల తేడాతోనే పరాజయం పాలయ్యారు. 2019 లో ఆచార్య జాతీయ బీసీ కమిషన్ సభ్యుడిగా భాద్యతలు చేపట్టారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శి భాద్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లా కూడా మహబూబ్ నగర్ కావడంతోనే గట్టి పోటీ ఇచ్చే అవకాశం కూడా ఉంటదనే ఉద్దేశ్యంతోనే సంఘ్ పరివార్ తల్లోజు ఆచార్య పేరు తెరపైకి తీసుకు వచ్చినట్టుగా పార్టీ వర్గాల సమాచారం.