Singareni : తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తి చేయడానికి అనుకూలంగా ఉన్న కొత్త బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని సింగరేణి గుర్తింపు సంఘం, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మంచిర్యాల జిల్లా, మందమర్రి ఏరియాలోని సింగరేణి కాసిపేట -1 గని వద్ద కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రానున్న మరికొద్ది నెలల్లో కొన్ని సింగరేణి గనులు మూతపడే అవకాశాలు ఉన్నాయన్నారు. తద్వారా కార్మికుల సంఖ్య కూడా తగ్గే అవకాశాలు సైతం ఉన్నాయన్నారు.
బొగ్గు గనుల కేటాయింపు కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలను తీసుకు వచ్చిందని, ఆ నిబంధనల వలన సింగరేణి సంస్థకు బొగ్గు గనుల కేటాయింపు కావడం లేదని సీతారామయ్య ఆరోపించారు. వేలంపాట లేకుండానే సింగరేణి సంస్థకు బొగ్గు గనుల కేటాయింపు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ నెలలో నిర్వహించే స్ట్రక్చర్ సమావేశంలో మరిన్ని కార్మికుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించడానికి కృషిచేస్తామన్నారు. సింగరేణిలో గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి స్ట్రక్చర్ సమావేశాలు నిర్వహించకపోవడంతో అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. తమ సంఘం గెలిచిన తరువాత స్ట్రక్చర్ సమావేశాలు నిర్వహిస్తే పలు సంఘాలు గుర్తింపు సంఘాన్ని విమర్శిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు మీను లక్ష్మీనారాయణ, బ్రాంచ్ ఇన్చార్జి చిప్ప నరసయ్య, బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ వెంకటస్వామి తో పాటు ఏఐటీయూసీ నాయకులు ఎస్ నాగేశ్వరరావు, చిప్పరి శ్రీహరి, వీ రాజేందర్, పార్వతి సురేష్, కొక్కిరాల సంతోష్, వీ లింగయ్య, ఐ సంపత్, రంజిత్, అశోక్, వర్క్ ఇన్స్పెక్టర్స్ బల్యం శ్రీనివాస్, సిగ్గం శంకరయ్య, మైనింగ్ స్టాప్ సెక్రెటరీ ఆడెపు రవీందర్, బియ్యాల రాజన్న, శంకరయ్య, సి-రిలే మున్సి దేవేందర్, ప్రభుదేవ్, ఆవునూరి తిరుపతి, కోలకాని శ్రీనివాస్, పాష, జాడి పోశం ఉన్నారు.