పదేళ్లకు సరిపడే ప్రణాళికలు తయారు చేయండి.
మస్టర్ పడి వెళ్లే వారిపై కఠిన చర్యలు తప్పవు
సమావేశంలో సింగరేణి చైర్మన్ ఘాటైన హెచ్చరిక
Singareni : సింగరేణి సంస్థలో విధులు నిర్వహించే వారు తమ విధుల్లో అలసత్వం ప్రదర్శించేవారు సంస్థ నుంచి వెళ్లిపోవచ్చని సింగరేణి చైర్మన్ అండ్ డైరెక్టర్ బలరాం నాయక్ స్పష్టం చేశారు. సంస్థ అభివృద్ధికి విఘాతం కలిగించేవారు అవసరం కూడా లేదన్నారు. అటువంటి వారితో సంస్థకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో సింగరేణిలో 11 ఏరియాలకు చెందిన జెనరల్ మేనేజర్లు, ప్రాజెక్ట్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ…..
మస్టర్ పడి విధులు నిర్వహించకుండా వెళ్లిపోయే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అటువంటి వారిని గుర్తించి నివేదిక కూడా పంపాలన్నారు. సంస్థ అభివృద్ధి కోసం పదేళ్లకు సరిపడ ప్రణాళికలను కూడా సంబంధిత శాఖల అధికారులు తయారు చేయాలన్నారు. అన్ని ఏరియాలకు కేటాయించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని రానున్న 43 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
కొత్త గనుల నిర్మాణం కోసం అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించుకొని, నూతన గనుల ప్రారంభానికి అవసరమైన నివేదికలు కూడా సిద్ధం చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించే అధికారులుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సంస్థ అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ పనిచేస్తున్నామా? లేదా అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు.
ఈ సమావేశంలో డైరెక్టర్లు డి. సత్యనారాయణ (ఈ అండ్ ఎం), ఎల్వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె.వేంకటేశ్వర్లు ( పీ అండ్ పీ), అడ్వైజర్ (ఫారెస్ట్రీ) మోహన్ పర్గేన్, జీఎం(కో ఆర్డినేషన్) ఎస్ డీ ఎం. సుభానీ, జీఎం (సీపీపీ) మనోహర్, జీఎం (మార్కెటింగ్) డి. రవి ప్రసాద్ తో పాటు ఆన్ని ఏరియాల జీఎంలు, ప్రాజెక్టు అధికారులు, ఏజెంట్లు పాల్గొన్నారు.