Singareni : సింగరేణి బొగ్గు గనుల్లో కొందరు అధికారులు కార్మికులను, సూపర్ వైజర్లను అకారణంగా వేధిస్తున్నారని సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డేగల ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రవీణ్ కుమార్ గోదావరి ఖని ఏరియా ఆసుపత్రి వద్ద మాట్లాడుతూ రామగుండం -1 ఏరియా లోని GDK 11 ఇంక్లైన్ మైన్ లో మొదటి షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తున్న షాట్ ఫైరర్ అజయ్ ని అదే గనికి చెందిన హెడ్ ఓవర్ మాన్ శ్రీనివాస్ అకారణంగా కులం పేరుతో దూషించాడని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
దూషించడమే కాకుండా దాడి చేయడంతో అజయ్ గాయపడ్డాడని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గాయపడిన అజయ్ వెంటనే గని మేనేజర్ కు ఫిర్యాదు చేయగా, చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. అజయ్ పై దాడి చేసిన ఓవర్ మాన్ ను వెంటనే విదుల నుంచి తొలగించాలని, అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రవీణ్ కుమార్ సందర్బంగా డిమాండ్ చేశారు. లేనిచో సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా శాంతియుత ఆందోళనను చేపడుతామన్నారు.
ఈ ఆందోళనకు సింగరేణి ఉన్నతాధికారులు, అధికారులు భాద్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇటీవల కొందరు ఉన్నతాధికారులు ,అధికారులు అకారణంగా కార్మికులను సంబంధం లేని అంశాలపై కూడా వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. అటువంటి వారు తమ ప్రవర్తన మార్చుకోవాలని కోరారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అజయ్ ను ప్రవీణ్ కుమార్ తో పాటు అసోసియేషన్ నాయకులు, కార్యకర్తలు పరామర్శించారు.