Home » INTUC : INTUC ని పట్టించుకోని ఎమ్మెల్సీ అభ్యర్థి

INTUC : INTUC ని పట్టించుకోని ఎమ్మెల్సీ అభ్యర్థి

INTUC : ఉమ్మడి ఆదిలాబాద్-కరీంనగర్-మెదక్-నిజామాబాద్ పట్టభద్రుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విద్యాసంస్థల అధినేత డాక్టర్. వూట్కూరి నరేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులు అందక ముందే నరేందర్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. తనకే టికెట్ ఖాయం అంటూ నాలుగు జిల్లాల్లో పట్టభద్రుల గడప తొక్కారు. టికెట్ ఖరారు అయిన తరువాత నరేందర్ రెడ్డి మూడు రంగుల జెండా పట్టారు. నాలుగు జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీల తోపాటు పార్టీ ప్రథమ శ్రేణి నాయకులను మచ్చిక చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టారు.

సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పట్టభద్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల వైపు ఎన్నడు కూడా కన్నెత్తి చూడని ఆయన ఇప్పుడు ఆ ప్రైవేట్ ఉపాధ్యాయుల ఓట్ల కోసం ఆరాటపడుతున్నారు. నాలుగు జిల్లాల్లో ఉన్న విద్యాసంస్థల అధినేతలతో కూడా మంతనాలు జరుపుతున్నారు. మొత్తానికి ఆయన తిరిగిన చోటుకే మళ్ళీ, మళ్ళీ వెళుతున్నారు. అభ్యర్థిస్తున్నారు.

కానీ సింగరేణి సంస్థలో ఉన్న పట్టభద్రుల వద్దకు మాత్రం నరేందర్ రెడ్డి వెళ్ళకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. గెలుపు ధీమాలో ఉండే ఆయన సింగరేణిలో ప్రచారం చేపట్టలేదనే ప్రచారం కూడా ఉంది. సింగరేణిలో సుమారు ఎనిమిది వేలకు పైగా పట్టభద్రులు ఉన్నారు. వీరంతా కూడా యూనియన్ల మాటకు విలువ ఇస్తారు. ప్రస్తుతం సింగరేణిలో అధికార పార్టీ అనుబంధ సంఘం INTUC ప్రాతినిధ్య సంఘంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు నరేందర్ రెడ్డి ఐఎన్టీయూసీ నాయకులను సంప్రదించలేదు. పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లాలు కేంద్రీకృతమై ఉన్నవి. ఈ మూడు జిల్లాల్లో RG -1,2,3, ఏరియాలతోపాటు మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల్లో 8 వేలకు పైగా పట్టభద్రులు విధులు నిర్వహిస్తున్నారు.

సోమవారం మంచిర్యాల జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు. ఆయన పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సభకు జనసమీకరణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఎన్టీయూసీ ని అభ్యర్థి పట్టించుకోక పోవడంతో సీఎం సభకు ఐఎన్టీయూసీ సహకరించే పరిస్థితి కనబడుత లేదని సమాచారం. పలువురు నాయకులు కూడా అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రవర్తన తీరుపై కూడా గుర్రుగానే ఉన్నారు. సింగరేణిలో ఎనిమిది వేల మంది పట్టభద్రులు చేజారి పోయిన నేపథ్యంలో పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి విజయం సాధించడం పై కూడా కార్మికుల్లో అనుమానాలు సైతం వ్యక్తం కావడం విశేషం.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *