ఉద్యోగ భద్రత కల్పించాలి
ఎన్నికల హామీలు అమలు చేయాలి
కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి):
మందమర్రి మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం సోమవారం కా. చెన్న రాజం అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి సీటీయూ (CTU) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంకె రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి దూలం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మున్సిపల్ కార్మికుల జీవితాల్లో ఆశించిన మార్పు కనిపించడం లేదన్నారు. సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గతంలో అమలులో ఉన్న విధంగానే కార్మికుల కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే భారత రాజ్యాంగం కల్పించిన కార్మిక హక్కులను పూర్తిగా అమలు చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను మూడు సంవత్సరాలు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సమావేశం అనంతరం మందమర్రి మున్సిపల్ కార్మికుల నూతన కమిటీని ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షుడు: సంకె రవి,అధ్యక్షుడు: చెన్న రాజం,ప్రధాన కార్యదర్శి: మేడపట్ల నర్సయ్య,ఉపాధ్యక్షులు: ఎల్కటూరి భూమయ్య, దాసరి శంకరమ్మ,సహాయ కార్యదర్శులు: సంగి పోశం, దుర్గం శంకర్, తోపాటు పది మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో సీటీయూ జిల్లా నాయకుడు కోలా వాసు, మారుపాక పోషు, గోడిసేల స్వరూప, అమ్మాయి, ఎంకమ్మ, పోశం తదితరులు పాల్గొన్నారు.

by