Kavith bail :ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు సోమవారం బెయిల్ మంజూరు కాలేదు. ఆమె తరుపు న్యాయవాదులు వేసిన బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్ట్ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కవిత కుటుంబ సభ్యులు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. బెయిల్ రాకపోవడంతో గులాబీ శ్రేణులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీలో ఉన్న నాయకులకు కూడా కొంతవరకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. కవిత కు బెయిల్ రాకపోవడాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా కనబడు తున్నాయి.గెలవడానికి అవకాశాలు ఉన్న అభ్యర్థులకు బెయిల్ సమస్య ఆటంకంగా మారె అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి.
కవితను ఈడీ అరెస్ట్ చేసి యాబై రోజులు దాటింది.సీబీఐ అరెస్టు చేసి ఇరువై ఐదు రోజులు దాటింది. ఆమెను అరెస్ట్ చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా కవిత తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేస్తూనే ఉన్నారు. కవితకు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో సాక్షులను ప్రభావితం చేస్తదని సీబీఐ, ఈడీ తరుపు న్యాయవాదులు గట్టిగానే వాదనలు వినిపిస్తున్నారు.
కవిత జ్యుడీషియల్ కస్టడీ మే ఏడో తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆమె తరుపు న్యాయవాదులు ప్రత్యేక కోర్ట్ ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ హై కోర్ట్ కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బిఆర్ఎస్ వర్గాల సమాచారం. హై కోర్ట్ కూడా బెయిల్ ఇవ్వని నేపథ్యంలో పరిస్థితి ఏమిటనేది కేసీఆర్ కుటుంబం ఆలోచనలో పడింది. మరో వారం రోజుల్లో ఎన్నికలు ముగియనున్నాయి. ఎన్నికలు ముగిసిన తరువాతనే కేసీఆర్ పూర్తి స్థాయిలో కవిత అరెస్ట్ కుగల కారణాలు, బెయిల్ రాకపోవడనికి గల కారణాలపై న్యాయ నిపుణులతో చర్చించే అవకాశాలు ఉన్నాయని బిఆర్ఎస్ వర్గాల సమాచారం.