Congress : బిఆర్ఎస్ లో ఏర్పడిన ఇంటిపోరు కాంగ్రెస్ పార్టీలో ఆనందం కంటే ఆందోళనే ఎక్కువ చేసిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన ఎంపీ మల్లు రవి ఇటీవల విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో అయన మాట్లాడుతూ బిఆర్ఎస్, బిజెపి, టీడీపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకుంటున్నాయని ఆరోపించారు. అక్కడితో ఆగకుండా రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడం ఖాయమంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలకు ఇంకా సమయం ఆసన్నం కాలేదు. కానీ అప్పుడే ఎంపీ మల్లు రవి మూడు పార్టీల కలయికపై ఎందుకు ఆందోళన చెందారో రాజకీయ వర్గాలకు కూడా అర్థంకాని ప్రశ్నగా మిగిలిపోయింది.
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే చంద్రబాబుపై మరోసారి రెండు కళ్ళ సిద్ధాంతాన్ని రుద్దడానికి బిఆర్ఎస్ సిద్ధమవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరిగింది. వరంగల్ సభలో కేసీఆర్ కూడా బాబుకు వ్యతిరేకంగానే మాట్లాడారు. అటువంటప్పుడు బీజేపీ, టీడీపీతో బిఆర్ఎస్ ఎందుకు కలిసి నడుస్తుందనే ప్రశ్న కూడా తెలంగాణలో తలెత్తింది. అయితే రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు గోడ దూకేది తెలియదు. బీఆర్ఎస్ ఎన్డీఏ కూటమిలో చేరాలనుకుంటోంది కాబట్టే బీజేపీని విమర్శించడం లేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తం కావడం విశేషం.
పార్టీని కాపాడుకోడానికి కమలం నీడలో నడవక తప్పదని కేసీఆర్ మదిలో ఒక ఆలోచన కూడా ఉంది. కానీ తాము దగ్గరకు తీసుకునే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ బాహాటంగానే స్పష్టం చేశారు. కలిసి ప్రయాణం చేసేది లేదని మోదీ స్పష్టం చేసినప్పటికీ కేసీఆర్ విషయంలో మాత్రం రాజకీయ వర్గాల్లో అనుమానం ఉంది. అదే విదంగా బీజేపీ, బిఆర్ఎస్, టీడీపీ కలిసి తమకు ఎక్కడ ఎసరు పెడుతారో అనే భయం మాత్రం ఉందని రాజకీయ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.