ఆదిలాబాద్ జిల్లాతో సంబంధం
సికాస బలోపేతంలో ముఖ్యపాత్ర
కటకం సుదర్షన్ తో కలిసి జిల్లాలో అడుగులు
ఛత్తీస్ గడ్ ఎన్కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు మృతి
Mavoist : ఛత్తీస్ గడ్ ఎన్కౌంటర్ లో మావోయుస్టు పార్టీ కి కోలుకోలేని గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వరుస ఎన్కౌంటర్లతో పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. కేంద్ర ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా దూసుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతిచెందారు. అందులో పార్టీ అగ్రనేత , జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతిచెందారు.
పార్టీకి కేశవరావు మూడో జాతీయ కార్యదర్శి. పీపుల్స్ వార్, ఆతరువాత మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించిన పార్టీకి జాతీయ కార్యదర్శిగా భాద్యతలు చేపట్టిన మూడో వ్యక్తి నంబాల కేశవరావు. ఆయనకంటే ముందు కొండపల్లి సీతారామయ్య, ఆయన తరువాత ముప్పాళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి జాతీయ కార్యదర్శి హోదాలో కొనసాగారు. కానీ మొట్ట మొదటిసారి మావోయిస్టు జాతీయ కార్యదర్శి బాధ్యతల్లో ఉన్న కీలక నేత ఎదురుకాల్పుల్లో చనిపోయారు. ఇది పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ. రాష్ట్ర కార్యదర్శులు, పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు ఎదురుకాల్పుల్లో చనిపోయిన సందర్భాలు ఉన్నవి. కానీ పార్టీని నడిపించే నాయకుడు ఎదురుకాల్పుల్లో చనిపోవడం పార్టీ చరిత్రలో మొదటిది.
నంబాల కేశవరావు శ్రీకాకుళం జిల్లా జియ్యన్న పేట సొంత ఊరు. తండ్రి ఉపాద్యాయుడు. ప్రతిభ గల విద్యార్ధి కావడంతో ఆరోజుల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వరంగల్ ఆర్ఈసి లో అతనికి ఇంజనీరింగ్ సీట్ లభించింది. అక్కడే ఆయనకు మొదట రాడికల్ విద్యార్ధి సంఘంతో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ 2018 లో జాతీయ కార్యదర్శి గా భాద్యతలు చేపట్టారు నంబాల కేశవరావు. ఇంజనీరింగ్ విద్యార్ధి దశలో ఉన్నప్పుడే ఒకసారి ఏబీవీపీ తో జరిగిన గొడవ కారణంగా ఒక్కసారి మాత్రమే అరెస్టు అయ్యారు. చనిపోయే వరకు నంబాల కేశవరావు ఎప్పుడు కూడా అరెస్ట్ కాలేదు. పార్టీ పూర్తి కాలపు కార్యకర్తగా మారిన నాటి నుంచి అయన ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. 70 ఏళ్ల వయసులో నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేస్తూనే నేలకొరిగాడు. ఏదిఏమైనప్పటికీ మావోయిస్టు మూల స్థంభం నేల కూలడం పార్టీకి మింగుడుపడని పరిస్థితి నెలకొంది.
నంబాల కేశవరావు కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో సంబంధం ఉంది. బెల్లంపల్లి కి చెందిన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్షన్ కు అయన సమకాలికుడని సమాచారం. 1987 లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం సంచరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే విధంగా కోల్ బెల్ట్ ప్రాంతంలో పార్టీ అనుబంద సంఘమైన సికాస ను విస్తరించడానికి కూడా ఆయన తన వంతు ముద్రవేశారు. ప్రస్తుత భూపాలపల్లి జిల్లా కొయ్యూరు ఎన్కౌంటర్ లో నల్లా ఆదిరెడ్డి, శీలం సురేష్ , ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి చనిపోయారు. ఆ సమయంలో నంబాల తృటిలో తప్పించుకున్నట్టు పోలీస్ రికార్డ్ లు చెబుతున్నాయి. చంద్రబాబు నాయుడిపై అలిపిరి వద్ద జరిగిన దాడిలో కూడా నంబాల ప్రముఖ పాత్ర పోషించారనే పేరు కూడా ఉంది.
బుధవారం జరిగిన ఎన్కౌంటర్ లో పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోయాడని, ఇది పెద్ద విజయం అంటూ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటించారు. కానీ ఏపీ పౌరహక్కుల సంఘం నాయకులు మాత్రం నంబాల కేశవరావు చనిపోలేదు అంటూ ప్రకటించడం విశేషం.