Home » “కళ్లు నెత్తికెక్కాయి.. అందుకే ఓడిపోయాం”

“కళ్లు నెత్తికెక్కాయి.. అందుకే ఓడిపోయాం”

కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):

2023 ఎన్నికల ఓటమిపై తొలిసారి బహిరంగ ఆత్మపరిశీలన చేసిన కేటీఆర్..
100 శాతం తప్పులు మావేనని అంగీకారం

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయంపై తొలిసారిగా బహిరంగంగా ఆత్మపరిశీలన చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఢిల్లీ పర్యటనలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం పార్టీ చేసిన తప్పులేనని స్పష్టం చేశారు. “మా కళ్లు నెత్తికెక్కాయి కాబట్టే మూడోసారి అధికారంలోకి రాలేకపోయాం. ఈ ఓటమిలో 100 శాతం మా తప్పులే ఉన్నాయి. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. మా లోపాలను తప్పకుండా సరిదిద్దుకుంటాం” అని పేర్కొన్నారు. 2023 ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజలు బలంగా విశ్వసించారని కేటీఆర్ తెలిపారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ అధికారంలో కొనసాగడంతో మరో పార్టీకి అవకాశం ఇవ్వాలనే భావన కూడా ఓటర్లలో ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.

అలాగే, బీఆర్ఎస్ కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతో, అంటే సుమారు నాలుగు లక్షల ఓట్ల వ్యత్యాసంతోనే అధికారాన్ని కోల్పోయిందని గుర్తు చేశారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈసారి పార్టీ ఓటు బ్యాంకు దాదాపు 10 శాతం తగ్గడం వాస్తవమేనని అంగీకరించారు. పార్టీ చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *