Home » Encounter : భారీ ఎన్కౌంటర్… 11 మంది మావోయిస్టులు మృతి

Encounter : భారీ ఎన్కౌంటర్… 11 మంది మావోయిస్టులు మృతి

Encounter : ఛత్తీస్ ఘడ్ లోని నారాయణపూర్ జిల్లాలోని కుర్రెవాయి అటవీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం భారీ ఎన్కౌంటర్ జరిగింది. కుర్రెవాయి అటవీ ప్రాంతంలో సుమారు 1400 మంది ప్రత్యేక పోలీస్ బలగాలు గాలింపు చేపట్టాయి. ముందస్తు సమాచారం మేరకు ప్రత్యేక బలగాలు గాలింపు చేపడుతున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడ్డట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో పోలీస్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారవర్గాల సమాచారం. మరొక దశలో ప్రత్యేక పోలీస్ బలగాలు కుర్రెవాయి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. మరోవైపు ఇంకా ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నట్టు సమాచారం.

తాజాగా జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయుస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఒకేసారి 11 మంది మావోయిస్టు చనిపోవడం పార్టీకి కోలుకోలేని పెద్ద దెబ్బ తగిలినట్టు అయ్యింది. మరోసారి దండకారణ్యంలో ఎదురుకాల్పులు జరగడంతో గిరిజన ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. అడవులను ప్రత్యేక బలగాలు జల్లెడ పడుతున్నాయి. సంఘటన స్థలంలో మావోయిస్టుల సామాగ్రి పెద్ద ఎత్తున లభించింది. మావోయిస్టుల మృత దేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి.

మృతులను ఇంకా గుర్తించాల్సి ఉంది.చీకటి కావడంతో మృతులను గుర్తించడం కష్టంగా ఉందని సమాచారం. కాగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కీలకమైన నేతలు సమావేశంలో ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే చనిపోయిన పదకొండు మంది మావోయిస్టుల్లో ఒక్కరో, ఇద్దరో కీలక నేతలు ఉంటారని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి వరుస ఎదురు దెబ్బలతో మావోయిస్టు పార్టీ తట్టుకోలేక పోతోంది. గడిచిన కొద్దీ రోజుల్లోనే 120 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్ లల్లో పోలీస్ బలగాలదే పైచేయి కావడం విశేషం.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *