BJP : భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ ఈటల రాజేందర్ కొద్ది రోజుల నుంచి రాజకీయ పరంగా నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు కమలం గూటిలో రాష్ట్రములో ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా ఉండేది. ఇటీవల కొన్ని పరిస్థితులను గమనిస్తే బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒక్కటైనట్టుగా తెలుస్తోంది. వీరిద్దరూ ఈటల రాజేందర్ కోసమే ఏకమైనట్టుగా కమలం గూటిలో గుసగుసలు జరుగుతున్నాయి.
పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక అంశం గత ఆరునెలల నుంచి నానుతోంది. రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డి మాత్రమే ఢిల్లీ పెద్దలకు సన్నిహితులు. మిగతా వారికీ కొంతమేరకు ఇబ్బందికరమే. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి ఏకాభిప్రాయం కోసమే రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ఆలస్యమవుతోందనే అభిప్రాయాలు సైతం పార్టీలో వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ తో పాటు కొందరు నాయకులపై విమర్శలు చేస్తున్నారు. కిషన్ రెడ్డిపై కూడా ఎదురుదాడికి దిగారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ భాద్యతలు ఎత్తుకొని కిషన్ రెడ్డి కోసం రాజసింగ్ ను బుజ్జగించి వచ్చారని పార్టీలో పెద్ద టాక్ నడుస్తోంది. అదేవిదంగా ఈటల రాజేందర్ ఎంపిక దాదాపుగా ఖరారు అయ్యిందనే ప్రచారం కూడా జోరుగా సాగింది. బండి సంజయ్, కిషన్ రెడ్డి లకు ఆయన నియామకం ఏ మాత్రం రుచించడంలేదు. మరో వ్యక్తి కోసమే ఆ ఇద్దరు ఒక్కటి కావడంతో ఈటల రాజేందర్ ఇప్పుడు ఒంటరి అయ్యారు అనే టాక్ గమలం గూటిలో నడుస్తోంది.