కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా వెళ్లిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ, అలాగే విద్యార్థులపై లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని కాంగ్రెస్ నాయకులు ఖండించారు.
విద్యార్థులు, మేధావులు జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు బీబీపేట మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఈ కార్యక్రమానికి బీబీపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పాత రాజు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మహమ్మద్ సలీం, భూమా గౌడ్, సీనియర్ నాయకులు ప్రశాంత్, మల్లేశం, పర్షా గౌడ్, తిరుపతి రెడ్డి, ప్రభాకర్, మహమ్మద్ ఆసిఫ్, ప్రసాద్, మీసాల సత్తయ్య, సిద్ధరాములు, బాశెట్టి నాగయ్య, శ్యాగ సిద్దయ్య, యువ నాయకులు మహేష్, స్వామి, నవీన్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

by