Mandamarri : మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ పాత బస్టాండ్ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడిగా సీనియర్ ఫోటో గ్రాఫర్, తిరుమల ఫోటో & వీడియో స్టూడియో నిర్వాహకులు కనకయ్య గౌడ్ విజయం సాధించారు. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికల నిర్వాహకులు ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నలుగురు వ్యాపారస్తులు బరిలో నిలిచారు. గత పది రోజుల నుంచి అధ్యక్ష పదవి కోసం పోటీపడిన వ్యాపారస్తులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 343 వ్యాపారస్తులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా 335 మంది ఓటు వేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు లెక్కింపు జరిగింది. పోటీలో ఉన్న కనకయ్య గౌడ్ 126 ఓట్లు సాధించి విజయం సాధించారు. రమేష్ కు 94 ఓట్లు, శ్రీధర్ కు 83 ఓట్లు, శివ కు 31 ఓట్లు పోలయ్యాయి. ఒక్క ఓటు చెల్లుబాటు కాలేదు. కనకయ్య గౌడ్ తన సమీప అభ్యర్థి రమేష్ పై 32 ఓట్ల మెజార్టీ సాధించి అధ్యక్ష పదవికు ఎంపికయినట్టుగా ఎన్నికల నిర్వాహకులు ప్రకటించారు.
ఈ సందర్బంగా కనకయ్య గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క వ్యాపారస్తుడికి కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం వ్యాపారస్తులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కరానికి కృషిచేస్తాన్నరు. అనంతరం వ్యాపారస్తులతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

by