Tirumala prasadam : తిరుమల-తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే జన్మ ధన్యమైపోతుంది. ఆ దేవుని దర్శన భాగ్యం ఎంతో, ప్రసాదం కూడా అంతే. సుమారు రెండువందల ఏళ్ల కిందటి నుంచే భక్తులకు లడ్డు తయారు చేసి భక్తులకు ప్రసాదం రూపంలో తిరుమల-తిరుపతి దేవస్థానం వారు అందజేస్తున్నారు. శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులందరికీ లడ్డు ప్రసాదాన్ని అందజేస్తున్నారు.
ఈ లడ్డు ప్రసాదాన్ని తయారు చేయడానికి రోజుకు ఎందరు శ్రమిస్తున్నారు. ప్రసాదం తయారు చేయడానికి సరుకులు ఎంత వాడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీవారి లడ్డు తయారు చేసే పోటులో 600 మంది నిత్యం పనిచేస్తుంటారు. ఇందులో 500 మంది శ్రీ వైష్ణవులతోపాటు మరో వంద మంది కాంట్రాక్టు సిబ్బంది చేతుల మీదుగా లడ్డు ప్రసాదం తయారవుతుంది. ఈ ఆరువందల మంది కలిసి ఒకేసారి 5,100 లడ్డూలను తాయారు చేయగలరు. రోజుకు కనీసం మూడు లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు.
నెలకు సుమారుగా ఒక కోటి లడ్డూలు భక్తులకు అందు బాటులో ఉంటున్నాయి. దర్శనం చేసుకోడానికి వీలుకాని భక్తులు తమ ఆధార్ కార్డు చూపిస్తే చాలు లడ్డు ప్రసాదం అందుతుంది. తిరుమల-తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంకు 2009 సెప్టెంబర్ 18 న పేటెంట్ హక్కు లభించింది.