CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి తగ్గింది. జూన్ నాలుగున ఫలితాలు వెల్లడి కానున్నాయి. జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆ తరువాత కేంద్రంలో కొత్త మంత్రి వర్గం కొలువు దీరనుంది. ఒకవేళ కేంద్రంలో ఇండియా కూటమి ఏర్పడితే సీఎం రేవంత్ రెడ్డి కి కొద్దీ రోజుల పాటు తీరిక లేకుండా ఉంటుంది. రాష్ట్రం నుంచి గెలుపొందిన వారిలో కొందరికి బెర్త్ కోసం ప్రయత్నాలు చేయక తప్పదు. ఆ తరువాతనే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మంత్రి వర్గం విస్తరణ కోసం కుస్తీ పట్టాల్సి ఉంటదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. పరిపాలనలో అయన తనదయిన శైలిలో ముద్రవేశారు. జెడ్పిటిసి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ గా భాద్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి మంత్రిగా అనుభవం లేదు. అయినా ఆయన తన పరిపాలన అంటే ఏమిటో ప్రతిపక్షాలకు రుచి చూపించారు. ఇప్పడు మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారనే ప్రచారం సాగుతోంది. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వారు తమవంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. నిబంధనల మేరకు 15 శాతం ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోదానికి అవకాశం ఉంది. 17 మందికి బెర్త్ అవకాశం ఉంది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రితో కలిసి 11 మంది మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఈ లెక్కన మరో ఆరుగురికి సీఎం బెర్త్ లో అవకాశం ఉంది.