Thirumala : తిరుమల తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా టీటీడీ బోర్డు కఠినమైన నిర్ణయాలు తీసుకొంటోంది. ఈనెల 31న టీటీడీ బోర్డు ప్రత్యేక సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసింది. ముక్కోటి ఏకాదశి సంధర్బంగా టికెట్ల పంపిణీ లో ప్రాణ నష్టం జరిగింది. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టింది.
సూర్య జయంతిని పురస్కరించుకొని ఫిబ్రవరి 4న తిరుమలలో రథ సప్తమి వేడుకలు జరుగనున్నాయి. ఇవి దాదాపుగా మినీ బ్రహ్మోత్సవాలతో సమానం. వీటిని అత్యంత వైభవంగా నిర్వహించబోతోంది టీటీడీ బోర్డు. ఒకే రోజు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి తిరువాడ విధుల్లో భక్తులకు దర్శనం ఇస్తారు.
ఈ నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి రానున్నారు. ఫిబ్రవరి 3 నుంచి 5 తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లను బోర్డు రద్దు చేసింది. ఎలాంటి టోకెన్ లేని భక్తులు నేరుగా సర్వదర్శనం క్యూ లైన్ లో వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చని దేవస్థానం అధికారులు ప్రకటించారు. వీఐపీ బ్రేక్ దర్శనలను రద్దు చేశారు. ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే దర్శనం ఉంటుంది. ఎన్నారైలు, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులకు కల్పిస్తున్న ప్రివిలేజ్ దర్శనాలను ఫిబ్రవరి 4న రద్దు చేశారు.