కాక కుటుంబంలో రెండో మంత్రి Dr .వివేక్
పార్టీలు మారడమే కొంత వెనుకబాటు
పార్టీ మారవద్దంటున్న అనుచరులు
చెన్నూర్ నియోజకవర్గంలో సంబరాలు
Dr.Vivek : ఎదుటి వారిని నొప్పించే మనస్తత్వం కాదు. నమ్ముకొన్న వారికి పైసా నష్టం జరగదు. బహిరంగంగా, అంతరంగంగా ఆయన్ని సొంత పార్టీ వారు కానీ, ఇతర పార్టీ వారు అయినా సరే ఏదన్నా అంటే మాత్రం తగిన సమయం కోసం వేచి చూస్తాడు. కానీ వెంటనే వారిని నష్టపరిచే మనస్తత్వం కాదు. ఒకవేళ ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెడితే క్షమించే గుణం కూడా ఆయనలో ఉంది. రాజకీయ కక్ష సాధింపులు ఆయనలో కనబడవు. ఇన్ని గుణాలు ఉన్న అయన మాత్రం రాజకీయంగా నమ్మి నష్టపోయిన సందర్భాలు సైతం ఉన్న విషయం తెలిసిందే.
అందుకే అయన పార్టీలు మారడంతోనే రాజకీయంగా నష్టపోయారంటారు రాజకీయ పండితులు. పుట్టినిల్లు అయినటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నందుకు ఆయనకు నచ్చినటువంటి మంత్రి పదవే వచ్చింది. ఆ మంత్రి ఎవరంటే, తెలంగాణ రాష్ట్రం, చెన్నూర్ నియోజక వర్గం ఎమ్మెల్యే, కాకా తనయుడు డాక్టర్ వివేక్ వెంకట స్వామి. ఆదివారం అయన రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.
చెన్నూర్ నియోజక వర్గం నుంచి కాకా కుటుంబం శాసన సభకు పోటీచేస్తోంది. మొదట మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకట స్వామి తనయుడు గడ్డం వినోద్ 2004 లో విజయం సాధించి కార్మిక మంత్రిగా భాద్యతలు చేపట్టారు. తాజగా 2023 లో ఇదే స్థానం నుంచి డాక్టర్ వివేక్ వెంకటస్వామి విజయం సాధించారు. ఆదివారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రి పదవితో పాటు అయన తనయుడు వంశీ కి ఎంపీ టికెట్ అనే ఒప్పందం అధిష్టానంతో చేసుకొన్న తరువాతనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టుగా అప్పట్లో రాజకీయ ప్రచారం జరిగింది.
ఆ విదంగా ఆయన పార్టీని నమ్ముకొని వచ్చినందుకు నచ్చిన పదవే వచ్చిందని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన పుట్టినిల్లు లాంటి కాంగ్రెస్ పార్టీ ని వదిలి పార్టీలు మారాల్సి వచ్చింది. రాజకీయాల్లో ఎత్తు,పల్లాలు సహజం. ఇప్పటికయినా పార్టీ మారకుండా ఉండాలని అయన్ని నమ్ముకున్నవారు కోరుతున్నారు. వివేక్ పార్టీ మారడం వలన క్యాడర్ కొంత గులాబీ, కమలం గూటికి వెళ్ళింది. పార్టీలు మారడం వలన వివేక్ రాజకీయంగా వెనుకబడిపోయారనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.
ఎమ్మెల్యే గా గెలిచిన తరువాత ఆయన నియోజకవర్గం పై అంతగా దృష్టి పెట్టడం లేదనే అభిప్రాయాలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని పలు మండలాల్లో మూడు నుంచి ఐదు గ్రూపులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోనే కొట్టుకోవడం జరిగిన సందర్భాలు సైతం ఉన్నవి. గ్రూపులుగా ఏర్పడి ప్రభుత్వ కార్యాలయాల్లో గంటల తరబడి తిష్ట వేయడంతో ఉద్యోగులకు పరిపాలన పరంగా తలనొప్పిగా మారింది.
డాక్టర్ వివేక్ కు అసలయిన అగ్ని పరీక్ష ముందున్నది. అభివృద్ధి మాట దేవుడెరుగు. ఒకవైపు మంత్రిగా భాద్యతలు నిర్వహించాలి. మరో వైపు క్యాడర్ లో కొందరికి క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియజెప్పాలి. అంతే కాదు అధిష్టానం ఆయన్ని నమ్మి ఇన్ని పదవులు ఇచ్చినందుకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అయన సత్తా ఏమిటో చూపించాల్సిన భాద్యత కూడా ఆయన భుజాలపై ఉందనే అభిప్రాయాలు సైతం నియోజకవర్గంలో వ్యక్తం కావడం విశేషం. లేదంటే గతంలో సోదరుడు చెన్నూర్ లో నడిచిన బాట నడవక తప్పదనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం కొసమెరుపు.