అడెల్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా అదనపు భాద్యతలు
2022 లో భార్య లింగవ్వ ఎన్కౌంటర్ లో మృతి
2016 లో లింగవ్వ సోదరుడు రవీందర్ సరెండర్
ఉమ్మడి ఆదిలాబాద్ లో పార్టీ కనుమరుగయినట్టే ?
Adellu : మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నవి. కీలక నేతలు లక్ష్యంగా ప్రత్యేక పోలీస్ బలగాలు మావోయిస్టుల స్థావరాల్లోకి దూసుకు వెళుతున్నాయి. కింది స్థాయి క్యాడర్ కాకుండా ఏకంగా ప్రధాన బాధ్యతల్లో ఉన్నవారినే గురిపెట్టి లక్ష్యాన్ని సాదిస్తున్నవి బలగాలు. చర్చలకు అవకాశం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం 2026, మార్చి నాటికి మావోయిస్టు అనే పదం లేకుండా చేయాలనే లక్ష్యంగ పెట్టుకొంది. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావుపై పెట్టిన గురి తప్పలేదు. ఎదురు కాల్పులు జరిగాయంటే పార్టీలో కీలక భాద్యతలు నిర్వహిస్తున్న వారే హతమవుతున్నారు.
శుక్రవారం ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లా అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ మృతిచెందాడు. అడెల్లు పై రూ : 25 లక్షల రివార్డ్ ఉంది. అడెల్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని బోథ్ మండలం పొచ్చెర గ్రామం నివాసి. అడెల్లు భార్య కంతి లింగవ్వ అలియాస్ అనిత కూడా పార్టీలోనే పనిచేసింది. లింగవ్వ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం లక్ష్మి సాగర్ గ్రామ నివాసి. ఈమె బోధ్ దళానికి భాద్యత వహించింది. 2022, డిసెంబర్ 22న ఛత్తీస్ ఘడ్ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందింది. లింగవ్వ సోదరుడు కంతి రవీందర్ కూడా బోథ్ దళంలో పనిచేసి 2016, డిసెంబర్ 1 న లొంగిపోయాడు.
అడెల్లు అలియాస్ భాస్కర్ 1995 లో దళంలోకి వెళ్ళిపోయాడు. జిల్లాలో పనిచేసినప్పుడు బలగాలకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న సందర్భాలు అనేకంగా ఉన్నవి. 2015 లో ఉట్నూర్ అడవుల్లో తప్పించుకున్నాడు. ఆ ఎదురు కాల్పుల్లో బలగాలపైకి తన ఏకే -47 తుపాకీ విసిరేసి తప్పించుకున్నాడు. 2020 తిర్యాణి అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో తప్పించుకున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గా
పనిచేసిన ఒక అధికారి ద్వారా లొంగిపోడానికి కుటుంబ సభ్యుల ద్వారా ప్రయత్నించాడు అడెల్లు. ఇంతలోనే అడెల్లు బలగాల తూటాలకు బలయ్యాడు.