Singareni : సింగరేణి సంస్థ అంటేనే బొగ్గు గనులు. అంతే కాదు బోలెడు కార్మిక సమస్యలు. ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణ, సంక్షేమం ఇలా ఎన్నో సమస్యలను కార్మికుల కోసం వెంట, వెంట పరిష్కరించాల్సి ఉంటుంది. సుమారు 43 వేల మంది అధికారులు, కార్మికులు కలిసి 24 గంటల పాటు బొగ్గు ఉత్పత్తి కోసం కృషి చేస్తుంటారు. ఇంత పెద్ద సంస్థకు పూర్తి స్థాయిలో విధులు నిర్వహించాల్సిన ఐఏఎస్ అధికారి తప్పనిసరి. ఐఏఎస్ అధికారి డైరెక్టర్ (పా) హోదాలో నియామకమై సింగరేణిలో విధులు నిర్వహిస్తుంటారు. గడిచిన 11 ఏళ్ల పాటు పూర్తిస్థాయి ఐఏఎస్ అధికారి నియామకంకు కార్మిక వర్గం నోచుకోలేదు.
కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నామని ప్రగల్బాలు పలికే కార్మిక సంఘాలు శాశ్వత అధికారి నియామకం గురించి పట్టించుకోక పోవడం శోచనీయం. చివరకు గుర్తింపు సంఘంగా ఉన్న సంఘం కూడా వాళ్ళ ప్రభుత్వం వద్ద కూడా సమస్యను చెప్పుకోలేక పోయింది. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అధికారిని నియమించడంతో కార్మిక వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది.
మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గౌతమ్ పోట్రు ను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి అధికారిగా డైరెక్టర్ (పా) పోస్టులో నియమించింది. ఇప్పటి వరకు పూర్తి స్థాయి అధికారి లేకపోవడంతో సింగరేణి డైరెక్టర్లే డైరెక్టర్ (పా) గా అదనపు భాద్యతలు నిర్వహించారు. డైరెక్టర్ (పా ) అధికారి కార్మిక సంక్షేమం, అపరిష్కృత సమస్యలు, పర్సనల్ విభాగం, పారిశ్రామిక సంబంధాలు, విద్య, ఆరోగ్యం, వైద్య, సామజిక అంశాలు చూడాల్సి ఉంటుంది. ఒకవైపు గుర్తింపు సంఘం గా ఏఐటీయూసీ, మరోవైపు అధికార పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ. ఈ రెండింటి మధ్య కొత్త డైరెక్టర్ (పా ) కార్మికుల సమస్యలను ఏ మేరకు పరిష్కరిస్తారో వేచి చూడాలంటోంది కార్మిక వర్గం.