Singareni : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారంలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ AITUC రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం చేశారు. శ్రీరాంపూర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో RK-5 గనిలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో సీతారామయ్య కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక్కో హామీని నెరవేరుస్తూ, కార్మికుల అపరిష్కృత సమస్యలను కూడా పరిస్కరిస్తున్నామన్నారు. సింగరేణి సంస్థ మరిన్ని కొత్త గనులను నిర్మిస్తేనే సంస్థ మనుగడ సాధిస్తుందన్నారు. బొగ్గు గనుల వేలంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రానున్న పదేళ్లలో పలు గనులు మూతపడుతున్నాయని, వీటి ద్వారా ఉత్పత్తి తగ్గుముఖం పడుతుందన్నారు. దాంతో పాటు కార్మికుల సంఖ్య కూడా తగ్గే ప్రమాదం ఉందని అయన ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన బొగ్గు గనుల చట్టం ప్రకారం గతంలో మాదిరిగా కొత్త గనులకు అనుమతి రావడం లేదన్నారు. కొత్త గనులు రావాలంటే నూతన చట్టం ప్రకారం వేలంలో సింగరేణి సంస్థ పాల్గొని దక్కించుకోవాలని కేంద్రం స్పష్టం చేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే విధంగ ఎఐటియుసి ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న వివిధ రకాల కార్మికుల సమస్యలను కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం యాజమాన్యం నిర్వహించే స్ట్రక్చర్, జెసిసి సమావేశాల్లో చర్చించి పరిష్కారం కోసం దశల వారీగా కృషి చేస్తున్నామన్నారు. గత ఐదేళ్ల నుంచి నిర్వహించని సమావేశాలను ఎఐటియుసి గెలిచిన తరువాత యాజమాన్యంను ఒప్పించడం జరిగిందన్నారు. ఈ విషయం పై కూడా కొన్ని సంఘాలు ఎఐటియుసిపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు.
గుర్తింపు సంఘంగా గెలిచిన తరువాత కార్మికుల ముఖ్యమైన సమస్యలైను పరిష్కరించడానికి కృషి చేశామన్నారు. ఆదాయపు పన్ను చెల్లింపు, మారుపేర్ల సమస్య, సొంతఇంటి పథకం, డిపెండెంట్, విజిలెన్స్ వేధింపులు, డిస్మిస్ కార్మికుల వంటి పలు సమస్యలను పరిష్కరించుటకు యాజమాన్యం అంగీక రించిందన్నారు. కోల్ ఇండియాకు సంబంధం లేని 11 రకాల అలవెన్సులను పెంచుటకు కూడా యాజమాన్యం ఒప్పుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శిలు కందికట్ల వీరభద్రయ్య, ముష్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, సహాయ కార్యదర్శి మోత్కూరు కొమురయ్య, ఏరియా కార్యదర్శి ప్రసాద్ రెడ్డి, ఫిట్ కార్యదర్శి గుడిగంటి నర్సింగ్ రావు, గొల్లపల్లి రామచందర్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, మైనింగ్ స్టాఫ్ ఉపాధ్యక్షులు అడ్డు శ్రీనివాస్, నాయకులు సురేష్, నాగేశ్వరరావు, లక్కిరెడ్డి సత్తిరెడ్డి, మాడగొని మల్లేష్, భోగ మధునయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.