Kavitha Bail : తెలంగాణ ఉద్యమకారుడిగా దేశవ్యాప్తంగా పేరు, ప్రతిష్టలు. పదేళ్లు ఒంటిచేత్తో రాష్ట్ర పరిపాలన. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీగా ఆవిర్భావం. రాజకీయ చాణక్యుడిగా పేరు. తన అంతరంగం ఎవరికీ అంతుపట్టదు. రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కొని పార్టీని, రాష్ట్ర పరిపాలనను కనుసైగలతో నడిపించిన నేత కేసీఆర్. అటువంటి నేతకు గడిచిన ఐదు నెలల కాలంలో కంటి నిండా నిద్ర లేదు. కడుపునిండా తిన్నది లేదు. ఈ ఐదునెలల కాలం కేసీఆర్ కు వనవాసమే అయ్యిందనేది స్పష్టం. పార్టీ ఓడిపోయిన బాధ కంటే , కన్న కూతురు కళ్లెదుట జైలు పాలవడంతోనే అయన నిద్రలేని రాత్రులు గడిపారు.
ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్ నోరుమెదపలేదు. బిఆర్ఎస్ ను బీజేపీ లో విలీనం చేస్తున్నారు. కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్రంలో మంత్రి పదవి, హరీష్ రావుకు ప్రతిపక్ష హోదా అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయినా నోరుపెదపలేదు కేసీఅర్. బండి సంజయ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతున్నదని ఆరోపించారు. అయినా కేసీఆర్ స్పందించలేదు. పార్టీ విలీనం, పొత్తుల పేరిట రకరకాల ఆరోపణలు వచ్చినప్పటికీ కేసీఆర్ ఎక్కడ కూడా నోరు జారలేదు. ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పటికీ కేటీఆర్, లేదంటే హరీష్ రావ్ మాట్లాడారు. కానీ కేసీఆర్ మాత్రం గడపదాటి రాలేదు. లోకాన్ని చూడలేదు. పార్టీని పట్టించుకోలేదు. కూతురు జైలు జీవితం గడపటాన్ని ఏ తండ్రి కూడా తట్టుకోలేడు.
ఎట్టకేలకు కూతురు కవితకు బెయిల్ మంజూరు అయ్యింది. ఇక కేసీఆర్ సరికొత్త రాజకీయ అవతారం ఎత్తబోతున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలకు దీటైన సమాధానాలు రాబోతున్నాయి. ఇన్ని రోజులు ప్రతిపక్షాలు మాట్లాడిన మాటలకు సమాధానాలు లేవు. ఇప్పుడు కేసీఆర్ నుంచి రావడం ఖాయం. ఇప్పిటి నుంచి తెలంగాణలో రాజకీయ యుద్ధమే జరుగుతుంది. ప్రతిపక్షాల మాటకు మాట తూటాలై పేలుతాయి. చర్యకు ప్రతి చర్య కూడా ఉంటుంది. కూతురు జైలు లో ఉన్న కారణంగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు ఒకే ఒక్క రోజు వెళ్లారు. విలీనం, పొత్తులపై అనేక రాజకీయ అభిప్రాయాలు పత్రికల్లో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటన్నిటికి కూడా కేసీఆర్ వద్ద సమాధానం ఉంది. ఇప్పుడు ఆ విలీనం, పొత్తులపై కూడా స్పష్టమైన సమాధానం కేసీఆర్ నుంచి వస్తుందని బిఆర్ఎస్ వర్గాల సమాచారం.