Kavitha : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత దూకుడు మీద ఉన్నారు. జాగృతి కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. ఏదో ఒక అంశంపై తెరమీదకు వస్తున్నారు. ప్రజల్లోకి వెళుతున్నారు. ఆమె చేస్తున్న పోరాటాలకు జాగృతి శ్రేణులు మాత్రమే వస్తున్నారు. గులాబీ క్యాడర్ దూరంగానే ఉంటున్నారు. కవిత లేఖ బహిర్గతం అయిన నాటి నుంచే కవిత తన రాజకీయ భవిష్యత్తు కోసం ప్రజల్లోకి వెళుతున్నారనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
గత కొద్దీ రోజుల నుంచి కవిత బీసీ ల కోసం నడుం బిగించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు తగిన న్యాయం జరగని నేపథ్యంలో ఎన్నికలను అడ్డుకుంటామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాజాగా ఆమె బీసీ సంఘాలతో మెదక్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గులాబీ నేతలు మాత్రం ప్రభుత్వాన్ని విమర్శించడానికే పరిమితం అయ్యారు. కానీ కవిత మాత్రం ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ్వని తూర్పార పడుతున్నారు. ఇది గులాబీ నేతలకు ఇబ్బందిగానే ఉంది.
ఇప్పడు కవిత మరింత దూకుడు పెంచి రైల్ రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. జూలై 17 న నిర్వహించే రైల్ రోకో కార్యక్రమానికి తరలిరావాల్సిందిగా జాగృతి క్యాడర్ కు ఆమె పిలుపునిచ్చారు. ఇప్పటివరకు కవిత చేపట్టిన కార్యక్రమాలకు జాగృతి క్యాడర్ మాత్రమే ముందుంది. గులాబీ శ్రేణులు మాత్రం వచ్చే అవకాశం లేదు. రాస్తారోకో, సభలు, ధర్నా కార్యక్రమాలు వేరు, రైల్ రోకో వేరు. తెలంగాణ ఉద్యమంలో రైల్ రోకో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై నమోదయిన కేసులు మొన్నటి వరకు కొనసాగాయి. అటువంటప్పుడు జాగృతి శ్రేణులు కేసులకు భయపడకుండా వస్తారా ? లేదా అనేది వేచి చూడాల్సిందే అంటున్నారు పలువురు రాజకీయ మేధావులు.